Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇరాన్, ఇరాక్ సరిహద్దులో ప్రకృతి విలయం
- 396 మంది మృతి, 7వేల మందికి గాయాలు
- రిక్టర్స్కేల్పై తీవ్రత 7.3గా నమోదు
- కొనసాగుతున్న సహాయకచర్యలు
బాగ్దాద్: ఇరాక్-ఇరాన్ దేశాల ఉత్తర సరిహద్దులో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 7.3గా నమోదైందని యూఎస్ జియోలజికల్ సర్వే అధికారులు తెలిపారు. ఈ భూవిలయంలో 396 మంది మృతి చెందగా, 7వేల మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు. భూకంపం ధాటికి అనేక భవనాలు ధ్వంసమయ్యాయి. శిథిలాల కింద వందలాది మంది చిక్కుకుని ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. ఇరుదేశాలకు చెందిన సహాయక బృందాలు శిథిలాల కింద చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసేపనిలో నిమగమయ్యాయి. ఈ ఏడాది సంభవించిన భారీ భూకంపాల్లో ఒకటిగా దీనిని భావిస్తున్నారు.
స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... తూర్పు ఇరాక్ హలబ్జా నగరానికి 31 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఇరాన్లోని 14 ప్రావిన్స్ల్లో భారీ నష్టం సంభవించింది. భూకంపం కారణంగా కెమ్రాన్షా ప్రావిన్స్ బాగా దెబ్బతిన్నది. ఒక్క సర్పోల్-ఎ-జహాబ్ ప్రాంతంలోనే 236 మంది చనిపోయారు. ఈ ప్రాంతం ఇరాక్ సరిహద్దు నుంచి 15కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. భూకంపం తర్వాత మరో 50సార్లు ప్రకంపనలు వచ్చాయి. దీంతో ప్రజలు క్షణక్షణం భయంభయంగా గడుపుతున్నారు. భూకంపం కారణంగా విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఓ పక్క భూప్రకంపనలు మరోపక్క చల్లటి వాతావరణంతో బాధితులు అల్లాడి పోతున్నారు. వీధుల్లో, పార్కుల్లో తలదాచుకుం టున్నారు. నగరంలోని ప్రధాన ఆస్పత్రి తీవ్రంగా దెబ్బతింది. దీంతో గాయాలపాలైన వందలాది మందికి చికిత్స చేయటంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని స్టేట్ మీడియా తెలిపింది.
భూకంపం కారణంగా పలు గ్రామాలు బాగా దెబ్బతిన్నాయని ఇరాన్కు చెందిన రెడ్ క్రెసెంట్ సంస్థ అధిపతి మొర్తజా సలీమ్.. ఇరిన్కు తెలిపారు. ''పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. టెలీ కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతిన్నది'' అని ఆయన చెప్పారు. ఇరాక్ వైపు.. కుర్దిస్థాన్ ప్రాంతంలోని సులైమనియా నగరానికి తూర్పున 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న దర్బన్దిఖాన్ పట్టణంలో భూకంప తీవ్రత ఎక్కువగా ఉంది. ''అక్కడ పరిస్థితి చాలా సంక్లిష్టంగా ఉంది'' అని కుర్దిస్థాన్ ఆరోగ్య మంత్రి రికౌత్ హమా రషీద్ తెలిపారు. ఇరాన్ ఉత్తర సరిహద్దుకు సమీపంలోని హలబ్జాకు నైరుతి దిశలో 30 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం సంభవించిందని యూఎస్ జియొలాజికల్ సర్వే (యూఎస్జీఎస్) తెలిపింది. భూప్రకంపనలు టర్కీ, ఇజ్రాయెల్, కువైట్లనూ తాకాయని పేర్కొన్నది. కాగా, ఇరాన్ ఈశాన్య ప్రాంతంలో బామ్ నగరంలో 2003లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్స్కేల్పై దీని తీవ్రత 6.6గా నమోదైంది. ఈ భూవిలయంలో 26వేల మంది మృతిచెందిన సంగతి తెలిసిందే.
సహాయక చర్యల్లో టర్కీ బృందాలు :
భూకంప బాధితులను ఆదుకునేందుకు టర్కీ సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. హలబ్బా ప్రాంతానికి 20 బృందాలను పంపినట్టు టర్కిష్ డిజాస్టర్ అండ్ ఎనర్జీ మేనేజ్మెంట్ అథారిటీ పేర్కొన్నది. ఇరాకీ కుర్దిస్తాన్ రీజియన్లో గాయపడిన 425మందికి టర్కీ ప్రత్యేక బృందాలు సాయమందించాయని ఇరాకీ రెడ్ క్రెసెంట్ సొసైటీ పేర్కొన్నది.
మృతుల కుటుంబాలకు ప్రముఖుల సంతాపం
భూవిలయంలో మృతిచెందిన వారి కుటుంబాలకు ఇస్లాం మత గురువు అయాతుల్లా ఖొమైనీ, ఇరాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి అబ్దుల్రజా రహ్మానీ ఫజిల్, కుర్దిస్ ఆరోగ్య మంత్రి రికౌత్ హమా రషీద్ తదితరులు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ''భూకంపం కారణంగా మృతిచెందినవారికి మా కెనెడియన్లు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.''- కెనెడా ప్రధాని జస్టిన్ ట్రూడో
బాగా దెబ్బతిన్న కెర్మన్షా ప్రాంతం
భూకంప కారణంగా ఇరాన్లోని కెర్మన్షా ప్రాంతం భారీగా నష్టపోయింది. భూకంపం ధాటికి కేవలం కెర్మన్షాలోనే 97 మంది మృతి చెందారు. ఈ పట్టణంలోని ప్రధాన ఆస్పత్రి కూడా కుప్పకూలిపోవడంతో సమయానికి చికిత్స అందక క్షతగాత్రులు ప్రాణాలు కోల్పోతున్నారు. రాత్రి వేళల్లో భూకంపం సంభవించడంతో రక్షణ సిబ్బందికి బాధితులను గుర్తించడం కష్టతరమైంది. సిబ్బంది హెలికాప్టర్ల సాయంతో వారిని గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు.