Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమెరికా నిఘా వర్గాల హెచ్చరిక
వాషింగ్టన్: క్రిస్మస్, న్యూఇయర్ వేడుకలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రదాడులకు పాల్పడేందుకు ఐఎస్ కుట్రపన్నిందని, ఈనేపథ్యంలో దేశ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని యూఎస్ నిఘా సంస్థ హెచ్చరించింది. ఐరోపా దేశాలకు ప్రయాణిస్తున్న అమెరికన్లు జాగ్రత్తగా ఉండాలని యూఎస్ ట్రావెల్ ఏజెన్సీ హెచ్చరించింది. క్రిస్మస్ పండుగ రోజున యూరప్ దేశాలలో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా బ్రిటన్, స్పెయిన్, స్వీడన్, రష్యా, ఫిన్ లాండ్, వాటికన్ సీటీ కూడా ఆ జాబితాల్లో ఉన్నట్టు తెలిపింది. ఈ దేశాల్లో ఉన్న అమెరికన్లు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఐఎస్, అల్ ఖైదా ఉగ్రవాదులు ఈ దేశాలపైనే దృష్టి సారించారని తెలిపింది. ఐఎస్ మీడియా వాఫా విడుదల చేసిన ఓ కొత్త పోస్టర్ మరింత ఆందోళన రేకెత్తిస్తోంది. మత గురువు పొప్ను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగే అవకాశం ఉన్నట్టు హెచ్చరిస్తున్నారు. క్రిస్మస్ బ్లడ్ సో వెయిట్... పేరిట విడుదల చేసిన పోస్టర్లో కారులో పక్కనే ఓ తుపాకీతో ఉగ్రవాది దూసుకొచ్చినట్టుగా ఉంది. ఇలాంటివి చాలా కష్టతరమైన దాడులే అయినప్పటికీ.. ఇటీవల వరుసగా జరుగుతున్న ఆత్మాహుతి దాడుల నేపథ్యాన్ని సునిశితంగా పరిశీలిస్తే మాత్రం ఈ హెచ్చరికలను అంత తేలికగా తీసుకోవటానికి వీల్లేదని ఎఫ్బీఐ మాజీ ఏజెంట్ స్టీవ్ గోమెజ్ చెబుతున్నారు. కాగా, గత ఏడాది క్రిస్మస్ పర్వదినానే జర్మనీలోని బెర్లిన్ నగరంలో ఉగ్రదాడి జరిగింది. ఓ ఉగ్రవాది ట్రక్కుతో బీభత్సం సృష్టించాడు. ఈ ఘటనలో 12 మంది మృతి చెందారు. టర్కీలోని ఇస్తాంబుల్ నగరంలోని ఓ నైట్క్లబ్లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 39 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో మరోసారి అలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలంటూ యూరప్తోపాటు పలు ఆసియా దేశాలకు కూడా అమెరికా ఏజెన్సీ ఎఫ్బీఐ హెచ్చరికలను జారీ చేసింది.