Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్ : 'గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్షిప్' అంతర్జాతీయ సదస్సు కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ హాజరవుతున్న సంగతి తెలిసిందే. శ్వేతసౌధంలో ట్రంప్ కీలక సలహాదారుల్లో ఒకరుగా అధికారిక హౌదాను కలిగివున్న ఇవాంకా, సదస్సులో అమెరికా బృందానికి నేతృత్వం వహిస్తారని ఆ దేశ విదేశాంగ శాఖ శనివారం వెల్లడించింది. నవంబరు నెలాఖరులో హైదరాబాద్లో జరగనున్న ఈ సదస్సుకు 170 దేశాల నుండి 1500మందికిపైగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు హాజరవుతున్నారు. మహిళా పారిశ్రామికుల్ని ప్రోత్సహించటం, అంతర్జాతీయ వాణిజ్య రంగంలో వారి పాత్ర పెంపొందేలా మద్దతు ఇవ్వటం..అనేవాటిపై సదస్సులో ప్రధానంగా చర్చించనున్నారు. పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు తమ తమ అనుభవాల్ని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో పంచుకోనున్నారు. అమెరికాకు చెందిన ఆమెజాన్, ఆమ్వే, సీఎన్బీసీ, కాగ్నిజాంట్, డెల్, గూగుల్, ఇంటెల్, కుఫ్మ్యాన్ ఫౌండేషన్, సేల్స్ఫోర్స్, సిలికాన్ వ్యాలీ బ్యాంక్, వాల్మార్ట్..మొదలైన అమెరికా కంపెనీలు ఈ సదస్సుకు స్పాన్సర్స్గా ఉన్నారు. సదస్సులో పాల్గొనే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఆర్థిక, ఇతర సహాయ సహకారాల్ని అందించడానికి ఇవి సుముఖంగా ఉన్నట్టు ప్రకటించాయి.