Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- న్యాయమూర్తిగా మళ్లీ భండారి ఎన్నిక
ఐక్యరాజ్యసమితి: అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే) ఎన్నికల్లో భారత్కు చెందిన దల్వీర్ భండారి మరోసారి న్యాయమూర్తిగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో భండారి, బ్రిటన్కు చెందిన జస్టిస్ క్రిస్టోఫర్ గ్రీన్వుడ్ మధ్య గట్టిపోటీ నెలకొన్న విషయం తెలిసిందే. అయితే చివర్లో బ్రిటన్ తన అభ్యర్థిని ఉపసంహరించుకోవడంతో భండారి ఎన్నిక ఖాయమైంది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అయిన భండారి 2012 ఏప్రిల్ 27న ఐసీజేకు ఎంపికయ్యారు.
నెదర్లాండ్స్లోని ది హేగ్లో ఉన్న అంతర్జాతీయ న్యాయస్థానంలో 15 మంది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఉంటుంది. వీరి పదవీకాలం తొమ్మిది సంవత్సరాలు. మూడేండ్లకోమారు వీరిలో ప్రతి ఐదుగురి స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తుంటారు. ఐరాసలోని జనరల్ అసెంబ్లీలో గల 193 మంది, భద్రతామండలిలోని 15 మంది ఈ న్యాయమూర్తులను ఎన్నుకొంటారు. ఈ ఎన్నికల్లో గెలవాలంటే జనరల్ అసెంబ్లీలో కనీసం 97ఓట్లు, భద్రతామండలిలో 8 ఓట్ల మెజార్టీ రావాలి. రెండింటిలో మెజార్టీ ఉన్న వారినే తీసుకుంటారు.
భండారి, గ్రీన్వుడ్లతో పాటు జస్టిస్ రోనీ అబ్రహం(ఫ్రాన్స్), జస్టిస్ అంటానియో(బ్రెజిల్), జస్టిస్ అబ్దుల్ ఖావీ యూసఫ్(సోమాలియా)ల పదవీకాలం 2018 ఫిబ్రవరి 5తో ముగియనుంది. దీంతో ఈ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. ఈ ఐదుగురితో పాటు పోటీలోకి లెబనాన్కు చెందిన జస్టిస్ నవాఫ్ సలామ్ కూడా వచ్చారు. వీరిలో ఫ్రాన్స్, సోమాలియా, లెబనాన్, బ్రెజిల్కు చెందిన న్యాయమూర్తులు మెజార్టీతో గెలుపొందారు. మిగిలిన ఒక స్థానంలో భండారి, గ్రీన్వుడ్ హోరాహోరీగా తలపడ్డారు.
11 రౌండ్లు పూర్తయినా ఫలితం తేలకపోవడంతో సోమవారం మరో రౌండ్ నిర్వహించాలని భావించారు. అయితే ఎన్నికలకు కొద్ది గంటల ముందు అనూహ్యంగా బ్రిటన్ పోటీ నుంచి తప్పుకుంది. తన నామినేషన్ను ఉపసంహరించుకుంటున్నట్టు జస్టిస్ గ్రీన్వుడ్ తెలిపారు. దీంతో భండారికి మార్గం సుగమమైంది.