Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జెరూసలేమ్ : గాజాలోని వెస్ట్బ్యాంక్ వద్ద ఇజ్రాయిల్ సైన్యం జరిపిన కాల్పుల్లో పాలస్తీనా ఉద్యమ నేత ఇబ్రహీమ్ అబు తురాయ (29) మృతి చెందారు. నిరసన వ్యక్తం చేస్తున్న క్రమంలో వీల్ చైర్లో ఉన్న అబును ఎలాంటి హెచ్చరికలు జారీ చేయకుండా కాల్చటంపై పాలస్తీ నీయులను మండిపడుతున్నారు. దీంతో, పాలస్తీనా-ఇజ్రాయిల్ మధ్య వివాదం మరో మలుపు తీసుకుంది. పాలస్తీనీయులు ఆందోళనకు దిగారు. జెరూసలేమ్ను ఇజ్రాయిల్ రాజధానిగా గుర్తిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలోనే తిరిగి ఆందోళనలు మొదలయ్యాయి. చేపలు పట్టుకుని జీవించే తురాయా 2008లో ఇజ్రాయిల్ సైన్యం నిర్వహించిన వైమానిక దాడుల్లో తన రెండు కాళ్లు కోల్పోయి వీల్చైర్కు పరిమితం అయ్యారు. అయినా కార్లు తుడుచుకుంటూ ఆయన హక్కుల పోరాటంలో పాల్గొనేవారు. ఇజ్రాయిల్కు వ్యతిరేకంగా నిర్వహించిన ప్రతీ ప్రదర్శనలోనూ ఆయన ముందుండే వారు. అప్పుడు కాళ్లు మాత్రమే కోల్పోయిన ఆయన.. ఇప్పుడు అదే ఇజ్రాయిల్ సైన్యం చేతుల్లో ఏకంగా ప్రాణమే పొగొట్టుకున్నారు. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.
పాలస్తీనాలో ఆందోళనలు...
తురాయ మరణ వార్త పాలస్తీనాలో దావానలంలా వ్యాపించింది. దీంతో, పాలస్తీనీయులు భగ్గుమన్నారు. ఆయనను కాల్చి చంపిన వీడియోలు కొన్ని సోషల్ మీడియలో వైరల్ కావటంతో ఆగ్రహ జ్వాలలు తారా స్థాయికి చేరుకున్నాయి. నిరసనకారులు రోడ్లపై ఆందోళన ప్రదర్శనలు చేపట్టారు. చనిపోయిన రెండు రోజుల ముందు ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు ఇప్పుడు పాలస్తీనీయులకు ప్రేరణగా నిలుస్తున్నాయి. 'ఇది(జెరూసలేం) మన భూమి.. వదిలే ప్రసక్తే లేదు. అమెరికా తన ప్రకటన వెనక్కు తీసుకోవాల్సిందే' అని ఆయన వ్యాఖ్యానించారు. ఇక ఆయన మరణంపై ఇజ్రాయిల్ స్పందించలేదు.