Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విషయం దాచిపెట్టినందుకు రూ.82లక్షలు చెల్లింపు : వాల్స్ట్రీట్ జర్నల్ కథనం
న్యూయార్క్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్నకు సంబంధించి తాజాగా ఓ రహస్యం వెలుగులోకి వచ్చింది. ఆయనకు ఓ అశ్లీల చిత్రాల నటితోనూ శారీరక సంబంధాలు ఉన్నట్టు తెలిసింది. అయితే, అధ్యక్ష పదవిలోకి రాకముందే ఆ సంబంధం ఉందని, ఆ విషయం బయటకు తెలియకుండా ఉండేందుకు, దానిని ఎక్కడా మాట్లాడకుండా ఉండేందుకుయ 1.30 లక్షల డాలర్లు (సుమారుగా రూ.82 లక్షలు) ఆ నటికి ముట్టజెప్పినట్టు వాల్స్ట్రీట్ జర్నల్ తెలిపింది. స్టీపానీ క్లిఫార్డ్ అనే అమెరికన్ పోర్న్స్టార్, 2006లో ట్రంప్ను కలుసుకుంది. ఆ సమయంలోనే ట్రంప్ మూడో వివాహం (మెలానియా) చేసుకున్నారు. అయినప్పటికీ తనకు పరిచయం అయిన క్లిఫార్డ్తో ట్రంప్ శారీరక సంబంధం ఏర్పరుచుకున్నారు. అయితే, ట్రంప్ అమెరికా అధ్యక్ష బరిలో దిగుతుండగా 'గుడ్మార్నింగ్' అమెరికా కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ట్రంప్తో తనకున్న సంబంధాలు మాట్లాడే ప్రయత్నం చేయగానే ఈ విషయం బయటకు పొక్కనీయకుండా చూసేలా మైఖెల్ కోహెన్ అనే న్యాయవాదికి ట్రంప్ బాధ్యతలు అప్పగించాడు. దాంతో మైఖెల్ మధ్యవర్తిగా ఉండి అధ్యక్ష ఎన్నికలకు కొద్ది వారాల ముందు క్లిఫార్డ్కు ఏకంగా లక్షా ముప్పైవేల డాలర్లు చెల్లించాడు. ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లో బయటకు రానివ్వొద్దని ఆమె దగ్గర హామీ తీసుకున్నాడు. ఈ విషయాలన్నింటినీ పూసగుచ్చినట్టుగా వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది. అయితే, వీటన్నింటిని మైఖెల్ కొట్టిపారేయగా క్లిఫార్డ్ మాత్రం స్పందించలేదు. వైట్హౌస్ మాత్రం ట్రంప్పై చేసిన తాజా ఆరోపణలు అబద్ధాలని, కుట్రలని కొట్టి పారేసింది. గతంలో ట్రంప్పై ఇలాంటివి పలు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.
ట్రంప్నకు వైద్య పరీక్షలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యం భేషుగ్గా ఉందని ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్ రోనీ జాక్సన్ వైద్య బృందం తెలిపింది. వాషింగ్టన్ డీసీలోని వాల్టర్ రీడ్ నేషనల్ మిలిటరీ మెడికల్ సెంటర్లో ట్రంప్నకు వైద్య పరీక్షలు నిర్వహించారు. కొన్ని గంటల పాటు కొనసాగిన ఈ పరీక్షల్లో ఆయన బీపీ, బ్లడ్షుగర్, కొలెస్ట్రాల్, గుండె స్పందన, బరువు వంటి పరీక్షలు చేశారు.పరీక్షల అనంతరం డాక్టర్ రోనీ జాక్సన్ మాట్లాడుతూ, ట్రంప్ ఆరోగ్యం చక్కగా ఉందని చెప్పారు. గత మూడు ప్రభుత్వాల నుంచి అధ్యక్షులకు డాక్టర్ రోనీనే పరీక్షలు నిర్వహిస్తున్నారు. ట్రంప్ ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన పూర్తి నివేదికను జనవరి 16న మీడియాకు వెల్లడించనున్నారు.