Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేపాల్కు సైబర్ కనెక్టివిటీ అందించనున్న చైనా
- తరచూ నెట్వర్క్ ఫెయిల్యూర్స్ వల్ల చైనా సాయం కోరిన నేపాల్
కాట్మాండు: దేశ పౌరులకు ఇంటర్నెట్ సేవల్ని అందుబాటులోకి తెచ్చేందుకు హిమాలయ దేశం నేపాల్ చైనా సాయాన్ని కోరింది. దీంతో గత దశాబ్దంగా నేపాల్ సైబర్ కనెక్టివిటీపై భారత్ ఏకచత్రాధిపత్యానికి తెర పడింది. ఇప్పటివరకూ భారతీ ఎయిర్టెల్, టాటా కమ్యూనికేషన్స్ లిమిటెడ్ ద్వారా నేపాల్ అంతర్జాల సౌకర్యాన్ని పొందుతూ వచ్చింది. అయితే, తరచూ నెట్వర్క్ ఫెయిల్యూర్స్ గురవుతుండటం నేపాల్ అధికారులకు విసుగొచ్చేలా చేసింది. దీంతో చేసేది లేక ఉత్తమ నెట్వర్క్ కల్పన కోసం చైనా సాయం కోరినట్టు నేపాల్ ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. నేపాల్ టెలికాం, చైనా టెలికాం గ్లోబల్లు కలసి చైనాలోని కెరుంగ్ నగరం నుంచి నేపాల్లోని రసువగడి వరకూ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ను ఏర్పాటు చేసినట్టు తెలిపింది.
50 కిలోమీటర్ల మేర నిర్మించిన నెట్వర్క్ను శనివారం ప్రారంభించినట్టు పేర్కొంది. భారత్ విఫల సర్వీసులకు చైనా నుంచి ప్రత్యామ్నాయం లభించినట్టు నేపాల్ టెలికాం అధికార ప్రతినిధి పేర్కొన్నారని 'రాయిటర్స్' తెలిపింది. రెండు కోట్లా 80లక్షల జనాభా కలిగిన నేపాల్లో ప్రస్తుతం 60 శాతం మందికి ఇంటర్నెట్ సర్వీసులు అందుతున్నట్టు పేర్కొంది.
సరిహద్దులో కీలక ప్రాంతంగా ఉన్న నేపాల్లో తమ పలుకుబడిని పెంచుకునేందుకు ఏండ్లుగా భారత్, చైనాలు ప్రయత్నిస్తున్నాయి. 2016లో పోర్టులను వర్తకానికి ఉపయోగించుకునేందుకు నేపాల్కు చైనా అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. 2017లో నేపాల్ చైనా తలపెట్టిన సిల్క్ రోడ్డులో చేరేందుకు అంగీకారం కూడా తెలిపింది.