Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్రిటన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ప్రముఖ పాఠశాల
లండన్ : స్కూలు చిన్నారులు రంజాన్ ఉపవాసం, హిజాబ్ ధరించటంపై నిషేధం ప్రకటించాలని బ్రిటన్లోని ప్రముఖ పాఠశాల 'సెయింట్ స్టీఫెన్' అక్కడి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. 8 ఏండ్ల లోపు బాలికలు హిజాబ్ ధరించటాన్ని ఈ పాఠశాల యాజమాన్యం 2016లో నిషేధం విధించి వార్తల్లో నిలిచింది. ఇప్పుడు 11 ఏండ్లలోపు బాలికల విషయంలోనూ నిషేధాన్ని అమలుజేయాలని పాఠశాల కోరుతోంది. ఇందుకు సంబంధించి తగిన ఆదేశాలు జారీ చేయాల్సిందిగా బ్రిటన్ ప్రభుత్వాన్ని సెయింట్ స్టీఫెన్ స్కూల్ డిమాండ్ చేసింది. అయితే పాఠశాల తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ స్కూల్లో ఎక్కువగా ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్కు చెందినవారి పిల్లలు చదువుకుంటున్నారు. బ్రిటన్లోనే అత్యంత ప్రతిష్టాత్మక ప్రైమరీ స్కూల్స్ జాబితాలో 'సెయింట్ స్టీఫెన్' మొదటిస్థానంలో ఉంది. 'స్కూల్స్ గైడ్ 2018' జాబితాలోనూ ముందు స్థానంలో నిలిచింది. ప్రభుత్వ నిధులతో నడుస్తున్న ఈ పాఠశాలకు భారత సంతతికి చెందిన నీనాలాల్ నేతృత్వం వహిస్తున్నారు. పాఠశాల పరిసరాల్లో ముస్లిం బాలబాలికల మత సాంప్రదాయలపై మార్గదర్శకాలు విడుదల చేయాల్సిందిగా బ్రిటన్ ప్రభుత్వాన్ని నీనాలాల్ కోరుతున్నారు. హిజాబ్ ధరించటం, రంజాన్ ఉపవాస దీక్ష అంశాలపై పాఠశాలలు ఎలాంటి నిబంధనల్ని పాటించాలో తెలియజేయాల్సిన అవసరముందని నీనాలాల్ అంటున్నారు. పాఠశాల గవర్నర్స్ ఛైర్మన్ ఆరిఫ్ క్వావీ మాట్లాడుతూ...''ముస్లిం విద్యార్థుల తల్లిదండ్రుల్లో కొంతమంది తమ డిమాండ్ను సమర్థిస్తుండగా, మరికొంత మంది వ్యతిరేకిస్తున్నారు. సెలవురోజుల్లో రంజాన్ ఉపవాసం పాటించమని విద్యార్థులకు సూచిస్తున్నాం. అంతేగానీ రంజాన్ పాటించవద్దని చెప్పటం లేదు. పాఠశాల క్యాంపస్లో ఉన్నన్ని రోజులూ వారి ఆరోగ్యానికి సంబంధించి మేము బాధ్యత వహించాలి కాబట్టి, ఈ డిమాండ్ను ముందుకు తెచ్చా''మని చెప్పారు.