Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'జైనాబ్' లైంగిక హత్య ఘటనపై ప్రజాగ్రహం
కసూర్ (పాకిస్తాన్) : ఏడేండ్ల బాలిక జైనాబ్పై పైశాచికత్వంగా దాడిచేసి, హత్య చేసి...చెత్త బుట్టలో పడేసిన సంఘటనతో పాకిస్తాన్లో ప్రజాగ్రహం పెల్లుబుకుతోంది. కసూర్ నగరంలో ప్రజలు పెద్ద సంఖ్యలో రోడ్లమీదకు వచ్చి పోలీసుల తీరుపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. దోషుల్ని పట్టుకొని శిక్షించాలని, బాధిత కుటుంబానికి సరైన న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మొత్తం పాకిస్తాన్ అంతా ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేసింది. బాలికలపై రోజు రోజుకీ పెరుగుతున్న లైంగికదాడులు, హత్యా ఘటనలు తీవ్రంగా కలిచివేస్తున్నాయి. పాక్ ప్రభుత్వం, పోలీసుల తీరుపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతున్నది. వివిధ నగరాల్లో ప్రజలు రోడ్లమీదకు వచ్చి ప్రదర్శనలు జరిపారు. 2017లో ఇలాంటి ఘటనలు ఒక్క కసూర్ జిల్లాలోనే 12 జరిగాయి. స్వచ్ఛంద సేవా సంస్థ 'సాహిల్ చైల్డ్ ప్రొటక్షన్ గ్రూప్' లెక్క ప్రకారం, పాకిస్తాన్లో గతేడాది తొలి ఆరు నెలల్లో చిన్నారులపై 1750 లైంగికదాడులు జరిగినట్టు తెలియజేసింది. చిన్నారులను కూడా కాపాడలేని ఈ పోలీసు వ్యవస్థ ఎందుకంటూ ప్రశ్నిస్తూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పంజాబ్ ప్రావిన్సులోని కసూర్ పట్టణంలో ఈ దారు ణం చోటు చేసుకుంది. జైనాబ్(7) తల్లిదండ్రులు ఉమ్రా యాత్రకు సౌదీ అరేబియా వెళ్లారు. దీంతో జైనాబ్ను వాళ్ల ఆంటీ వద్ద వదిలే శారు. గత మంగళవారం ఖురాన్ చదువుకునేందుకు బయటకు వెళ్లిన జైనాబ్ ఇంటికి తిరిగి రాలేదు. దీంతో ఆందోళన చెందిన జైనాబ్ ఆంటీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఐదు రోజుల తర్వాత బాలిక ఇంటికి ఒక మైలు దూరంలో ఉన్న చెత్తకుప్పలో జైనాబ్ మృతదేహాన్ని గుర్తించారు.
జైనాబ్పై లైంగికదాడి జరిగిందని, ఆ తర్వాత హత్య చేశారని శవపరీక్షలో తేలిందని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన పాకిస్తాన్ ప్రజలను షాక్కు గురి చేసింది. చిన్నారులపై ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్న రాక్షసుడ్ని అరెస్టు చేసి, కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.