Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ట్రంప్ సర్కార్ ప్రవేశపెట్టిన ద్రవ్య వినిమయ బిల్లుకు సెనెట్లో చుక్కెదురు
- బిల్లులో 'డ్రీమర్స్' భద్రత అంశాలు లేవని డెమొక్రాట్లు, రిపబ్లికన్లు అభ్యంతరం
- ప్రభుత్వ కార్యకలాపాలకు నగదు ప్రవాహం నిలిపివేత
వాషింగ్టన్: నిర్ణీత వ్యవధిలో ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందకపోవడంతో అమెరికా ప్రభుత్వం మూతపడింది. దీంతో ప్రభుత్వ వార్షిక లావాదేవీలు నిలిచిపోయాయి. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సమయంలోనే ఇలాంటి పరిస్థితి రావడం గమనార్హం. సెనేట్లో జనవరి 19లోగా ద్యవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందాల్సి ఉంది. అయితే డెమోక్రాట్లు, రిపబ్లికన్ సభ్యుల మధ్య సయోధ్య కుదరకపోవడంతో బిల్లు ఆమోదం పొందలేదు. ఈ కారణంగా అత్యవసర సేవలు మినహా ప్రభుత్వ కార్యకలాపాలన్నీ నిలిచిపోయాయి. శుక్రవారం అర్థరాత్రితో ద్రవ్య వినిమయ బిల్లు గడువు ముగిసింది. ఈలోగా కొత్త బిల్లు ఆమోదం పొందాల్సి ఉంది. కొత్త బిల్లులో 'డ్రీమర్స్' (సరైన పత్రాలు లేకుండా వలసవచ్చినవారి పిల్లలు) భద్రతకు ఎలాంటి ప్రతిపాదనా లేదని డెమోక్రాట్లు ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నారు.
షట్డౌన్తో ఫిబ్రవరి 16 వరకు ప్రభుత్వం మూతపడే అవకాశం ఉంది. బిల్లు ఆమోదానికి మరో 9 మంది డెమోక్రాట్ల మద్దతు అవసరం. 230-197 ఓట్ల తేడాతో గురువారంనాడు బిల్లుకు ప్రతినిధుల సభ ఆమోదించింది. శుక్రవారంనాడు సెనెట్లో బిల్లు ఆమోదానికి కావాల్సిన 60 ఓట్లను ట్రంప్ సర్కార్ సాధించుకోలేకపోయింది. 50-48 ఓటింగ్తో బిల్లు ఆమోదం నిలిచిపోయింది. అయితే సోమవారంకల్లా రెండు పార్టీల మధ్య ఒక అవగాహన ఏర్పడుతుందని, కొద్ది రోజుల్లోనే బిల్లు ఆమోదం పొందటం ఖాయమని రిపబ్లికన్లు అంచనావేస్తున్నారు. స్వాప్నికుల (డ్రీమర్స్) భద్రత అంశంపై కొందరు రిపబ్లికన్లు కూడా డెమోక్రాట్లకు మద్దతిస్తున్నారు. 1981 నుంచి అమెరికాలో ఈ విధంగా ప్రభుత్వం మూతపడటం ఇది 12వ సారి. 2013లో కూడా పక్షం రోజులపాటు అగ్రరాజ్య ప్రభుత్వం మూతపడింది. షట్డౌన్ కారణంగా అమెరికా ప్రభుత్వానికి వారానికి రూ.42వేల కోట్ల నష్టం వాటిల్లనుందని అంచనా. ప్రభుత్వం మూతపడటంతో ఉద్యోగులకు 40రోజుల పాటు వేతనం లేని సెలవులు ప్రకటించారు. డెమోక్రటిక్ పార్టీ సెనేటర్తో ట్రంప్ జరిపిన చర్చల్లో ఏమాత్రం పురోగతి కనిపించలేదు. ఈ పరిస్థితికి డెమోక్రాట్లే కారణమని ట్రంప్ ఆరోపిస్తున్నారు. ఈ మేరకు ట్రంప్ కార్యాలయం ప్రకటన కూడా విడుదల చేసింది.
ప్రభుత్వ కార్యకలాపాలన్నీ 'షట్డౌన్'
ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందకపోవడంతో అమెరికా ప్రభుత్వం మూతపడింది. ప్రభుత్వ నిర్వహణ, ఖర్చులకు సంబంధించి నిధుల వినియోగంలో డెమోక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ప్రభుత్వం షట్డౌన్ అయింది. దీని వల్ల ప్రభుత్వ కార్యకలాపాలకు నిధులు నిలిచిపోయాయి. అత్యవసర సేవలకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. 40శాతం ప్రభుత్వ ఉద్యోగులకు వేతనం లేని సెలవులు ప్రకటించారు.
ఎందుకు ..?
ఈ ద్రవ్య వినిమయ బిల్లులో అమెరికాలోని స్వాప్నికుల(డ్రీమర్స్) భద్రతకు సంబంధించి ఎలాంటి ప్రతిపాదన లేదని డెమోక్రాట్లు వ్యతిరేకించారు. వీరికి కొందరు రిపబ్లికన్లు కూడా మద్దతిచ్చారు. స్వాప్నికులు ఎవరంటే సరైన పత్రాలు లేకుండా అమెరికాకు వలస వచ్చిన వారి పిల్లలు. వీరికి తాత్కాలికంగా అమెరికాలో ఉండే హక్కు ఇచ్చారు. వీరు ఇక్కడ చదువుకుని ఉద్యోగాలు చేసుకోవచ్చు. ఒబామా హయాంలో చట్టబద్ధంగా వీరికి ఈ అవకాశం కల్పించారు. అయితే ట్రంప్ దీన్ని రద్దు చేసే ప్రయత్నంలో ఉన్నారు. అలా చేస్తే దాదాపు 8లక్షల మంది స్వాప్నికుల భవిష్యత్తు అయోమయంలో పడుతుంది. తాజా ద్రవ్య వినిమయ బిల్లులో ట్రంప్ స్వాప్నికుల భద్రతను పక్కన పెట్టడంతో డెమోక్రాట్లు ఆగ్రహించారు.
నష్టమెంత ?
2013లో 16 రోజులపాటు ఏర్పడ్డ 'షట్డౌన్' వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థకు కలిగిన నష్టం 24 బిలియన్ డాలర్లు (రూ.1.53 లక్షల కోట్లు). ప్రముఖ రేటింగ్ సంస్థ 'ఎస్ అండ్ పీ' ప్రకారం, ఇప్పుడు ఏర్పడ్డ సంక్షోభం కారణంగా ఆర్థిక వ్యవస్థకు ప్రతీవారం 6 బిలియన్ డాలర్లు (రూ.38 వేల కోట్లు) నష్టం వాటిల్లనున్నదని అంచనా! రిపబ్లికన్-డెమొక్రట్ల మధ్య సయోధ్య కుదరనంత వరకు ఈ 'షట్డౌన్' కొనసాగుతోంది. మొత్తం అమెరికా ఆర్థిక వ్యవస్థను ఈ సంక్షోభం ప్రభావితం చేస్తుందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ ఉద్యోగులు ఇంటికే పరిమితం
- ప్రభుత్వం మూతపడటంతో లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు వేతనం లేకుండా ఇంట్లో కూర్చోవాల్సి వస్తుంది. రక్షణ విభాగంలో పనిచేసే వేలాది మంది ఉద్యోగులపైనా ఈ ప్రభావం పడుతుంది.
- అత్యవసర సేవల్లో పనిచేసే 15 లక్షల మంది రక్షణ శాఖ సిబ్బంది, 40వేల మంది హోంల్యాండ్ భద్రత సిబ్బంది యథావిధిగా బాధ్యతలు నిర్వర్తిస్తారని పెంటగావ్ తెలిపింది. వీరు కాకుండా పెంటగావ్లోని సుమారు 7,40,000 మంది ఉద్యోగులు ఇంటికి పరిమితం అవుతారు.
- అధ్యక్ష నివాసం వైట్హస్, కాంగ్రెస్, ఫెడరల్ కోర్టులు, వెటరన్స్ అడ్మినిస్ట్రేషన్ విభగాలు యథావిధిగా నడుస్తాయి. యూఎస్ పోస్టల్ సర్వీసు కూడా నడుస్తుంది.
- ఫెడరల్ బడ్జెట్పై ఆధారపడే దేశ రాజధాని వాషింగ్టన్పై షట్డౌన్ ప్రభావం పడనుంది. చెత్త నిర్వహణ, వీధుల శుభ్రతకు సంబంధించిన సేవలు నిలిచిపోతాయి. గ్రంథాలయాలు మూతపడతాయి. కానీ పాఠశాలలు, ప్రజారవాణా విభాగాలు ఎప్పటిలాగే కొనసాగుతాయి.
- అమెరికాలో విమాన ప్రయాణాలను నిర్వహించే ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ సాధారణంగా పనిచేస్తుంది. విమానాశ్రయాలు ప్రయాణికుల కోసం తెరిచే ఉంటాయి.
- తాత్కాలిక ప్రణాళికల ప్రకారం..కొన్ని ప్రాంతాల్లో జాతీయ పార్కులు, మ్యూజియంలు తెరిచి ఉంచే అవకాశం ఉంది. అయితే అందులోని ప్రభుత్వ ఉద్యోగులకు బదులుగా ప్రైవేటు కాంట్రాక్టర్లతో నడిపించే అవకాశం ఉంటుంది.
- వైద్య విభాగంలో అత్యవసర సేవలు నడుస్తాయి. వ్యాధి నియంత్రణ కేంద్రాలకు సంబంధించిన ఉద్యోగుల్లో 61శాతం మంది విధులకు హాజరుకారు. పరిశోధనకు సంబంధించిన నేషనల్ ఇన్సిస్టిట్యూట్స్ మూతడపతాయి.
- రెవెన్యూ సేవలు, సోషల్ సెక్యురిటీ అడ్మినిస్ట్రేషన్, గృహ పట్టణాభివృద్ధి విభాగాలు, విద్య, వాణిజ్య, కార్మిక, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన విభాగాలు మూతపడతాయి.