Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టేకాఫ్ అయిన కొద్దిసేపటికే...
- టెహ్రాన్ నుంచి యసూజ్ నగరానికి బయల్దేరిన ఏటీఆర్-72
టెహ్రాన్: ఇరాన్లో ఏస్మ్యాన్ ఎయిర్లైన్స్కు చెందిన ప్రయాణికుల విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో విమానంలో ఉన్న 66 మంది మృతి చెందారు. వీరిలో ఆరుగురు విమాన సిబ్బంది కూడా ఉన్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. విమానం లో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా కూలిపోయి ఉంటుందని అధికారులు ప్రాథమిక అంచనాకొచ్చారు. విమానాశ్రయ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం...ఏస్మ్యాన్ ఎయిర్లైన్స్కు చెందిన ఏటీఆర్-72 అనే రెండు ఇంజిన్లు కలిగిన విమానం రాజధాని టెహ్రాన్ నుంచి యసూజ్ పట్టణానికి బయల్దేరిన క్రమంలో ఆదివారం ప్రమాదానికి గురైంది. ఏటీఆర్-72 టేకాఫ్ అయిన కొద్ది సేపటికే రాడార్తో ఉన్న సంబంధాలు తెగిపోయాయి. దీంతో, గల్లంతైన విమానం కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. అనంతరం పర్వతీయ ప్రాంతంలో ఈ విమానం కూలిపోయినట్టు గుర్తించాయి. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న వారందరూ మరణించారని విమానాశ్రయ అధికారులు ధ్రువీకరించారు. సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కొండ ప్రాంతంలో విమానం కుప్పకూలిపోవడంతో సహాయక చర్యలకు కొంత అంతరాయం ఏర్పడింది. ఘటనాస్థలికి అంబులెన్స్లు చేరుకోలేకపోతున్నాయని ఇరానియన్ ఎమర్జెన్సీ ఆర్గనైజేషన్ ప్రతినిధి తెలిపారు. దీంతో ఘటనా స్థలానికి హెలికాప్టర్లను పంపించినట్టు ఆయన వెల్లడించారు. ప్రత్యక్ష సాక్ష్యుల కథనం ప్రకారం విమానాన్ని అత్యవసరంగా కిందికి దించేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో విమానం కూలిపోయినట్టు చెబుతున్నారు. టెహ్రాన్ నుంచి 480 కిలోమీటర్ల దూరంలో ఉన్న దెనా పర్వత ప్రాంతంలో విమానం కూలిపోయింది.
విమానంలో సాంకేతిక సమస్యలు...
ఏటీఆర్-72లో గతంలో సాంకేతిక సమస్యలు తలెత్తినట్టు ఇరాన్ ఏస్మ్యాన్ ఎయిర్లైన్స్ అంగీకరించింది. గతేడాది అక్టోబర్26న సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడు నిపుణుల పర్యవేక్షణలో పరిష్కరించామని తెలిపింది. గతనెల 25న మరోసారి సమస్య వచ్చినప్పుడు ఈ విమానం అత్యవసరంగా ల్యాండింగ్ అయిందని పేర్కొన్నది. అప్పటి నుంచి ఏటీఆర్-72 విమానాన్ని మెహ్రాబాద్ విమానాశ్రయంలో నిపుణుల పర్యవేక్షణలో ఉంచామని ఏస్మ్యాన్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. విమానంలో సాంకేతిక సమస్యలు లేవని, గతంలో తలెత్తిన సమస్యలన్నింటినీ పరిష్కరించామని అన్నారు. ఈ ప్రమాదంపై దర్యాప్తునకు ఇరాన్ ప్రభుత్వం ఆదేశించింది.