Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెద్ద కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ వారం రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం భారత్కు చేరుకున్నారు. ఈ పర్యటనలో తన విలాసవంతమైన రెసిడెన్షియల్ ప్రాజెక్టు ట్రంప్ టవర్స్కు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా భారత్లో విదేశాంగ విధానంపై కూడా ప్రసంగించనున్నారు. కోల్కతా, ముంబయి, పుణె, గురుగ్రామ్ నగరాల్లో భారత పెట్టుబడిదారులు, బిజినెస్ లీడర్లతో ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఆయన పాల్గొంటారని వాషింగ్టన్ పోస్ట్ వెల్లడించింది. జూనియర్ ట్రంప్ భారత్లో అడుగుపెట్టకముందే ప్రముఖ వార్తాపత్రికల్లో ఆయన రాక గురించి ఆయనతో వ్యాపార ఒప్పందం కుదుర్చుకున్న సంస్థలు ప్రచారం కూడా చేశాయి. వచ్చే శుక్రవారం ఇండో-పసిఫిక్ సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన గ్లోబల్ బిజినెస్ సమ్మిట్లో భారత్లో ఆయన తొలిసారి ప్రసంగించనున్నారు. ఈ సమ్మిట్లో 'భవిష్యత్ కోసం భారత్ను సన్నద్ధం చేయడం' అనే అంశంపై భారత ప్రధాని నరేంద్రమోడీ సైతం మాట్లాడనున్నారు. భారత్లో ట్రంప్ జూనియర్ పర్యటన పరస్పర విరుద్ధ ప్రయోజనాల కిందకే వస్తుందని అమెరికాలో కొంత మంది నిపుణులు విమర్శలు చేస్తున్నారు. త్వరలో కోల్కతాలో ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న 137 విలాసవంతమైన ఫ్లాట్ల నిర్మాణాన్ని కూడా ఆయన పరిశీలించనున్నారు.