Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టోక్యో : శాస్త్రవేత్తలు కొత్తగా మరో 15 గ్రహాలను కనుగొన్నారు. సౌరకుటుంబం బయట ఉన్న ఈ గ్రహాల్లో ఓ సూపర్ ఎర్త్ కూడా ఉంది. దీనిపై జీవం ఉండే అవకాశం కూడా ఉంది. సౌరకుటుంబానికి దగ్గర్లోనే కొన్ని చిన్న, చల్లటి నక్షత్రాల చుట్టూ ఇవి తిరుగుతున్నట్టు గుర్తించారు. వీటిని ఎరుపు మరగుజ్జులుగా పిలుస్తున్నారు. విశ్వం ఏర్పాటుకు సంబంధించిన అధ్యయనాలకు ఇవి తోడ్పడనున్నాయని శాస్త్రవేత్తల బృందానికి సారథ్యం వహిస్తున్న టోక్యో ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రొఫెసర్ తెరుయుకి హిరానో వెల్లడించారు. కే2-155 అనే ఈ ఎరుపు మరగుజ్జు నక్షత్రం మనకు 200 కాంతి సంత్సరాల దూరంలో ఉంది. దీని చుట్టూ భూమిని పోలిన మూడు సూపర్ ఎర్త్స్ తిరుగుతున్నాయి. ఇవి మన భూమి కంటే కాస్త పెద్ద పరిమాణంలో ఉన్నట్టు గుర్తించారు. ఇందులో బయట ఉన్న కే2-155డీ అనే గ్రహం జీవం మనుగడకు అనుకూలంగా ఉన్నట్టు హిరానో తెలిపారు. ఈ అధ్యయనాన్ని ది ఆస్ట్రోనామికల్ జర్నల్లో ప్రచురించారు. ఈ కే2-155డీపై ద్రవరూపంలో నీళ్లు ఉండే అవకాశం ఉన్నట్టు శాస్త్రవేత్తల అంచనా. నాసాకు చెందిన కెప్లెర్ స్పేస్క్రాఫ్ట్తోపాటు భూమిపై ఉన్న పలు టెలిస్కోపుల సాయంతో ఈ గ్రహాలపై అధ్యయనం జరుపుతున్నారు. ఈ కే2-155డీ వ్యాసం భూమి కంటే 1.6 రెట్లు పెద్దగా ఉంది.