Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 50 మంది మృతి, 12 మందికి గాయాలు
ఖాట్మండ్ : నేపాల్ రాజధాని ఖాట్మండ్ విమానాశ్రయంలో సోమవారం ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఢాకా నుంచి అమెరికాకు బయలుదేరిన బంగ్లాదేశ్కు చెందిన బీఎస్-211 విమానం ఖాట్మండ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 50 మంది ప్రయాణికులు మృతిచెందారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరో తొమ్మిది మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు. విమానంలో నేపాల్కు చెందిన 33 మంది, బంగ్లాదేశ్కు చెందిన 32 మంది, ఒకరు చైనా, మరొకరు మాల్దీవ్కు చెందిన పౌరులు ప్రయాణించినట్టు అధికారులు ధ్రువీకరించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. విమానాశ్రయ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... ఢాకా విమానాశ్రయం నుంచి నేపాల్కు వచ్చిన బీఎస్-211 విమానం త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్ అయ్యే క్రమంలో ఒక్కసారిగా నిలకడ కోల్పోయి క్రాష్ల్యాండ్ అయింది. దీంతో, విమానం నుంచి ఒక్కసారిగా దట్టమైన పొగలు వ్యాపించాయి. విమానం క్రాష్ల్యాండ్ కావడంతో మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న నేపాల్ ఆర్మీ రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టింది. అగ్నిమాపక బృందాలు విమానంలో ఎగిసిపడ్డ మంటలను ఆర్పేందుకు శ్రమిస్తున్నాయి. విమాన శకలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నట్టు నేపాల్ ఆర్మీ పేర్కొన్నది. విమానం బయలుదేరిన సమయంలో నలుగురు సిబ్బంది, 67మంది ప్రయాణికులు సహా మొత్తం 71మంది విమానంలో ఉన్నారు. ప్రస్తుతం ప్రమాదానికి గురైన విమానం అమెరికా, బంగ్లాదేశీ జాయింట్ వెంచర్ అయిన యూఎస్-బంగ్లా గ్రూపునకు చెందినది. 2014, జులైలో ఈ బంగ్లాదేశీ సంస్థ కార్యకలాపాలను ప్రారంభించింది. బాంబార్డియర్, బోయింగ్ విమానాలను ఈ సంస్థ నడుపుతోంది. ఇప్పుడు ప్రమాదానికి గురైంది బాంబార్డియర్ డాష్ 8 క్యూ400 విమానం. దీన్ని ప్రపంచంలోనే అత్యంత అధునాతన టర్బోప్రాప్ ఎయిర్క్రాఫ్ట్గా పిలుస్తారు. ఈ ఘటనపై నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఘటనాస్థలిలో యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని, ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కాగా, నేపాల్లో విమాన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. 2016లో నేపాల్లోని పర్వతాల్లో ట్విన్ ఆటర్ టర్బోప్రాప్ ఎయిర్క్రాఫ్ట్ కూలిపోయింది. ఈ ఘటనలో 23 మంది మృతి చెందారు. రెండు రోజుల క్రితం ఓ చిన్న పాసింజర్ విమానం క్రాష్ ల్యాండింగ్ కావడంతో ఇద్దరు పైలట్లు మరణించారు.