Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కంప్యూటర్లు లేకుండా నల్లబల్లపై సాఫ్ట్వేర్ బోధన
- కంప్యూటర్లను పంపి సాయమందించిన భారతీయ కంపెనీ
అక్రా(ఘనా): కంప్యూటర్, సాఫ్ట్వేర్ గురించి పాఠశాల పిల్లలకు బోధించడానికి ఘనా దేశపు ఉపాధ్యాయుడు పడిన తపనకు తగిన గుర్తింపు దక్కింది. పాఠశాలలో కంప్యూటర్ లేకపోయినా... నల్లబల్లపై కంప్యూటర్, అది పనిచేసే విధానం, దానివెనుకున్న సాఫ్ట్వేర్ గురించి ఆ ఉపాధ్యాయుడు చెబుతున్న తీరును అందరూ ప్రశంసించారు. ఆఫ్రికా అనగానే మనకు చీకటి ఖండం అన్న మాటే గుర్తుకు వస్తుంది. ఆ మాటకు తగ్గట్టే అక్కడి దేశాలు చాలా విషయాల్లో వెనకబడే ఉంటాయి. అయితే ఘనాలోని ఓ పాఠశాలలో ఉపాధ్యాయుడు మాత్రం తమకు సౌక ర్యాలు అందుబాటులో లేవని ఆగిపోకుండా తన విద్యార్ధులకు సాధ్యమైనంత ఎక్కువ జ్ఞానాన్ని అందించాలని భావించాడు. అందుకు తగ్గట్టే పాఠశాలలో కంప్యూటర్లు లేకపోయినా పిల్లలకు నల్లబల్ల మీదే కంప్యూటర్ను ఎలా వాడాలి ? అనే విషయాలు నేర్పించసాగాడు.
పాఠాలు చెప్పే సమయంలో మైక్రోసాఫ్ట్ వర్డ్ విండో బొమ్మను గీశాడు. దాన్ని ఆయన ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. ఆయన దాన్ని మామూలుగానే పోస్ట్ చేసినా...అది రెండువారాలుగా సామాజిక మాధ్యమాల్లో అందర్నీ ఆకట్టుకుంటోంది. ఉపాధ్యాయుడి ప్రయత్నం భారత్కు చెందిన ఓ కంపెనీకి ఎంతో నచ్చింది. వెంటనే ఆ కంపెనీ వారందరూ మాట్లాడుకొని ఏదైనా సాయం చేయాలని భావించారు. ''ఆ ఉపాధ్యాయుడి అంకిత భావం మమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుంది. ఒక ఐటీ శిక్షణా కేంద్రాన్ని నడుపుతున్న మేము వారికి ఉపయోగపడేలా ఏదైనా చేయాలనుకున్నాం. అందుకు తగ్గట్టుగా కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద వారికి ఐదు కంప్యూటర్లు, ఉపాధ్యాయుడికి ఒక ల్యాప్ట్యాప్, వాటికి సంబంధించిన పుస్తకాలు అందించాం'' అని ఆ భారత కంపెనీ వెల్లడించింది. మన భారత కంపెనీతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మరికొంతమంది కూడా ఆ పాఠశాలకు కంప్యూటర్లు అందించారు. అంతేకాకుండా మైక్రోసాఫ్ట్ ఆఫ్రికా అయితే ఏకంగా సింగపూర్లో జరిగే వార్షిక మైక్రోసాఫ్ట్ ఎడ్యుకేటర్స్ ఎక్సేంజ్ సమావేశానికి ఆహ్వానించింది.