Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్: అమెరికాలోని ప్రవాస భారతీయులు ఆందోళన బాటపట్టారు. మంగళవారం వాషింగ్టన్ నగరంలో నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో వేలాది మంది భారతీయ ఉద్యోగులు, నిపుణులు పాల్గొన్నారు. అమెరికా పౌరసత్వమైన గ్రీన్కార్డుల జారీకి బాగా జాప్యం జరుగుతోందని, వీటి జారీకి దేశాల వారీ పరిమితి ఎత్తేయాలని కోరుతూ పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టారు. అమెరికాలో ఉంటున్న భారత సంతతి వ్యక్తులు చాలా మంది గ్రీన్కార్డుల కోసం దరఖాస్తులు చేసుకుని వేచి చూస్తున్నారు. దేశాల వారీ కోటా వల్ల పెద్ద ఎత్తున వీరి దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. అత్యధికంగా హెచ్1-బీ వీసాలపై అమెరికా వెళ్లి గ్రీన్కార్డుల కోసం దరఖాస్తులు చేసుకున్న వారికి నష్టం కలుగుతోందని, సంవత్సరాల తరబడి గ్రీన్కార్డుల కోసం ఎదురు చూడాల్సి వస్తోందని వారు వాపోతున్నారు.
దేశాల వారీ కోటాను ఎత్తేయాలని అక్కడి భారతీయులు ఆయా ప్రాంతాల్లోని ఎంపీల మద్దతు కోరుతూ ర్యాలీలు చేశారు. ముఖ్యంగా అర్కాన్సాస్, కెంటుస్కీ, ఓరెగావ్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించారు. దేశాల వారీ కోటా వల్ల ప్రవాస భారతీయులు ఇబ్బందులకు గురవుతున్నారని, ఈ విషయంపై అమెరికన్లకు, ఎంపీలకు అవగాహన కల్పించేందుకు తాము ప్రయత్నిస్తున్నట్టు ర్యాలీ నిర్వహకులు తెలిపారు. ఎప్పుడో లిండన్ జాన్సన్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఈ నిబంధనను పెట్టారని, ఈ కాలానికి ఇది ఏమాత్రం సరిపోదని అభిప్రాయపడ్డారు.
లిండన్ జాన్సన్ 1963 నుంచి 1969వరకు అధ్యక్షుడిగా పనిచేశారు. కెంటుస్కీలోని ఫ్రాంక్ఫర్ట్లో జరిగిన ర్యాలీలో దాదాపు 300మంది గ్రీన్కార్డుల కోసం ఎదురుచూస్తున్న భారతీయ నిపుణులు పాల్గొన్నారు.