Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్: అమెరికాలో హెచ్1-బీ వీసాదారుల భాగస్వాములు హెచ్-4 వీసాపై పని అనుమతి పొందే విధానాన్ని తొలగించొద్దని అమెరికాలోని దాదాపు 130 మంది ఎంపీలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సర్కార్ను అభ్యర్థించాయి. ఇండో-అమెరికన్ శాసనకర్త అయిన ప్రమీలా జైపాల్ ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్ సభ్యులు ట్రంప్ యంత్రాంగాన్ని కోరారు. హెచ్-1బీ వీసాపై పనిచేస్తున్న ఉద్యోగుల భాగస్వాములకు పని అనుమతి యథాతధంగా ఉంచాలని, ఎంతో మంది ఐటీ ఉద్యోగులు ఈ విధానంతో లాభం పొందుతున్నారని వారు పేర్కొన్నారు. మాజీ అధ్యక్షుడు ఒబామా హయాంలో హెచ్1-బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు హెచ్-4 వీసాతో పని అనుమతి కల్పించిన సంగతి తెలిసిందే. అయితే ఈ విధానాన్ని ట్రంప్ రద్దు చేయాలని భావిస్తున్నారు. రద్దు చేస్తే ఆ ప్రభావం దాదాపు 70వేల మంది హెచ్-4 వీసాదారులపై పడుతుందని తెలిపారు. హెచ్-4 వీసాదారుల్లో అత్యధికులు భారతీయులే ఉన్నారు. ఈ మేరకు ప్రమీలా జైపాల్ నేతృత్వంలోని ఎంపీలు అమెరికా సెక్రటరీ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారులకు లేఖ పంపించారు. హెచ్-4 వీసాదారులకు పని అనుమతి కల్పించడం వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ స్థిరంగా మారిందని, ఎంతో మంది హెచ్1-బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు, ముఖ్యంగా మహిళలకు ఉపయోగపడుతోందని అన్నారు. అందులో చాలా మంది అమెరికాలో స్థిర నివాసం ఏర్పరచుకునే ప్రయత్నంలో ఉన్నవారని తెలిపారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయం అమెరికాకు ఎంతో నష్టం కలిగిస్తుందని శాసనకర్తలు లేఖలో పేర్కొన్నారు. ఆ లేఖపై రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీలకు చెందిన దాదాపు 130 మంది శాసనకర్తలు సంతకాలు చేశారు. హెచ్-4 వీసాకు సంబంధించి ప్రస్తుతమున్న విధానాన్నే కొనసాగించాలని లేఖలో వారు అభ్యర్థించారు.