Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జూన్ 1 నుంచి అమలు
కౌలాలంపూర్ : వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ని మలేసియా రద్దు చేసింది. జూన్ 1 నుంచి దేశంలో ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. ఇటీవల సాధారణ ఎన్నికల్లో ప్రధానమంత్రిగా ఎన్నికైన మహతిర్ మహమ్మద్ తన ఎన్నికల హామీల్లో భాగంగా జీఎస్టీని రద్దు చేశారు. దీంతో వచ్చే నెల 1 నుంచి మలేసియాలో జీరో శాతం జీఎస్టీ ఉంటుంది. 6 శాతం జీఎస్టీ బదులుగా దేశంలో అధునీకరించిన అమ్మకపు, సేవల పన్ను విధానాన్ని ప్రవేశపెడతామని మహమ్మద్ ఎన్నికల్లో వాగ్దానం చేశారు. 2017లో మలేసిియా ప్రభుత్వ ఆదాయంలో 18 శాతం జీఎస్టీ ద్వారానే లభించింది. అయితే జీఎస్టీపై దేశంలో అనేక మంది ప్రజలు అసంతృప్తితో ఉన్నారని, జీఎస్టీతో జీవన వ్యయం భారీగా పెరిగిందని మహమ్మద్ పేర్కొన్నారు. కనీస వేతనాలు పెంచుతామని, సామాన్య ప్రజలకు రాయితీలు అందచేస్తామని మహమ్మద్ హామీ ఇచ్చారు. జీఎస్టీ రద్దుతో పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి కళ్లెం వేయొచ్చని మలేసియా ప్రభుత్వం భావిస్తోంది. ఆసియా-ఫసిఫిక్ ప్రాంతంలో చమురు, సహజ వనరుల ఉత్పత్తి దేశాల్లో మలేషియా నాలుగో స్థానంలో ఉంది. అంతర్జాతీయ పెట్రో ఉత్పత్తుల ధరల పెరుగుదల మలేసియాకు లాభసాటిగా మారనుంది. జీఎస్టీ రద్దుతో ద్రవ్యలోటు నియంత్రణలోకి వస్తుందని మలేషియా ప్రభుత్వ సీనియర్ సలహాదారుడు జెటి అక్తర్ అజీజ్ విశ్వాసం వ్యక్తం చేశారు. దీని వల్ల ప్రభుత్వ ఆదాయం తగ్గి, బడ్జెట్ లోటు పెరిగే అవకాశం ఉందని మరికొంత మంది ఆర్థిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2015లో అప్పటి ప్రధాని నజీబ్ రజాక్ మలేసియాలో జీఎస్టీని అమల్లోకి తీసుకొచ్చారు. అప్పుడు బ్యారెల్ ముడిఅదివరకెన్నడూ లేని రీతిలో 37 డాలర్లకు పడిపోయింది.
నజీబ్ ఇంట్లో సోదాలు
మాజీ ప్రధాని నజీబ్ రజాక్ నివాసంపై గురువారం తెల్లవారుజామున పోలీసులు దాడి చేశారు. ఆయన హయాంలో పెద్ద ఎత్తున జరిగిన అవినీతి కుంభకోణంపై విచారణ పునరుద్ధరించిన నేపథ్యంలో అవసరమైన పత్రాల కోసం ఆయన ఇంట్లో సోదాలు చేపట్టారు. విదేశాల్లో కూడా దర్యాప్తు జరుగుతున్న ప్రభుత్వ పెట్టుబడుల నిధికి సంబంధించిన మనీ లాండరింగ్ దర్యాప్తులో భాగంగా ఈ దాడులు జరిగాయి. సమీపంలోని మసీదులో రజాక్ ప్రార్దనలు చేసి ఆయన ఇంటికి వచ్చే సమయానికి డజనుకు పైగా పోలీసు వాహనాలు అక్కడికి చేరుకున్నాయి. నిధుల కుంభకోణంపై రజాక్పై అభియోగాలు నమోదు చేస్తామని కొత్త ప్రధాని మహతిర్ మహ్మద్ హెచ్చరించిన నేపథ్యంలో రజాక్ అరెస్టు తప్పదని ఊహాగానాలు చెలరేగాయి.