Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యునైటెడ్ యూరోపియన్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తాం : ఈయూ అధ్యక్షుడు టస్క్
సోఫియా: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లాంటి మిత్రులుంటే శత్రువుల అవసరమే లేదంటూ యూరోపియన్ యూనియన్ (ఈయూ) అధ్యక్షుడు డొనాల్డ్ టస్క్ చమత్కరించారు. 2015లో బ్రిటన్, రష్యా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఈయూ, అమెరికా దేశాలు ఇరాన్తో అణు ఒప్పందాన్ని కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఈ ఒప్పందం నుంచి తాజాగా అమెరికా వైదొలిగింది. ఈనేపథ్యంలో ట్రంప్ చర్యలపై చర్చించేందుకు బల్గేరియా రాజధాని సోఫియా నగరంలో 28దేశాలకు చెందిన ఈయూ నేతలంతా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో టస్క్ మాట్లాడారు. ట్రంప్ చర్యలపై మండిపడ్డారు. ఇరాన్ అణు ఒప్పందం నుంచి వైదొలగకపోవడంతో తమపై ఆంక్షలు మోపేందుకు ట్రంప్ కుట్ర పన్నారని విమర్శించారు. ప్రపంచ శాంతి దృష్ట్యా ఇరాన్తో కుదుర్చుకున్న అణు ఒప్పందానికి కట్టుబడి ఉండటమే సరైన నిర్ణయమని తాము భావిస్తున్నామని అన్నారు. ఈ ఒప్పందం సజావుగా అమలైనట్టయితే ఇరాన్ అణ్వస్త్ర పరీక్షల నుంచి దూరంగా ఉండగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం టెల్అవీవ్ నగరం నుంచి జెరూసలేమ్కు యూఎస్ రాయబార కార్యాలయం తరలింపు అంశంపై మాట్లాడారు. యూఎస్ ఎంబసీని జెరూసలేమ్కు తరలింపు వెనుక ట్రంప్ కుట్ర దాగివుందన్నారు. ట్రంప్ అనుసరిస్తున్న విధానాల కారణంగానే మధ్య ప్రాఛ్యం మండుతున్న గోళంలా రగిలిపోతున్నదని అన్నారు. గాజా సరిహద్దులో ఇజ్రాయిల్ బలగాల కాల్పుల్లో 60 మంది పాలస్తీనీయులు మృతి చెందారు. వీరి మృతికి ట్రంప్ నైతిక బాధ్యత వహించాలని టస్క్ డిమాండ్ చేశారు. అమెరికా అధ్యక్షుడి చర్యలకు వ్యతిరేకంగా యునైటెడ్ యూరోపియన్ ఫ్రంట్ను ఏర్పాటు చేస్తామని అన్నారు. రష్యా, చైనాలతో ట్రంప్ ప్రభుత్వాన్ని పోల్చారు. ఈయూ భ్రమలను తొలగించినందుకు ట్రంప్కు కృతజ్ఞతలు చెప్పారు. ఈయూ నుంచి బ్రిటన్ వైదొలగడంతో తలెత్తే నష్టాన్ని నివారించేందుకు సభ్యదేశాలు మరింత ఐకమత్యంతో వ్యవహరించాలని టస్క్ సూచించారు. అమెరికా, రష్యా, చైనా దూకుడు వైఖరితో మారుతున్న ప్రపంచ పరిణామాల్లో కచ్చితంగా యూరప్ కీలక పాత్రను పోషిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. యూరప్ దేశాల వస్తువులపై పన్నులు విధించడం, ఇరాన్ అణుఒప్పందం నుంచి అమెరికా వైదొలగడం వంటి అంశాలపై ఈయూ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. సభ్యదేశాల ఐకమత్యం, ఇరాన్ అణుఒప్పందం తదితర అంశాలపై చర్చించేందుకు ఈయూ సభ్యదేశాల నేతలు సమావేశమయ్యారు.