Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉ.కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్కు ట్రంప్ బెదిరింపులు
- అణ్వాయుధాల్ని వదలకుంటే సరి...లేదంటే...
వాషింగ్టన్ : ''మాతో ఒప్పందం చేసుకొని మా మాట విన్నారో సరి. లేదంటే...లిబియాలో గడాఫీని ఎలాగైతే చంపేశామో...అలాగే ఉ.కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ను చంపేస్తాం...''అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరింపు వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో సర్వత్రా ఆందోళన వ్యక్తమైంది. ఏకపక్షంగా వ్యవహరిస్తున్న అమెరికా తీరు మారకపోతే ట్రంప్-కిమ్ మధ్య సింగపూర్ భేటీపై పునరాలోచన చేస్తామని కొద్ది రోజుల క్రితం ఉ.కొరియా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రతీకారవాంఛతో ట్రంప్ పై బెదిరింపు వ్యాఖ్యలు చేసినట్టు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జూన్ 12న సింగపూర్లో కిమ్ జోంగ్ ఉన్- డొనాల్డ్ ట్రంప్ మధ్య చారిత్రక భేటీ జరగాల్సి ఉంది.
గురువారం మీడియాతో డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ...''చారిత్రక భేటీ అంతా అనుకున్నట్టు జరిగి, విజయవంతమైతే...ఉ.కొరియాను కిమ్ జోంగ్ ఉన్ పాలించుకోవచ్చు. మాకు ఏమీ అభ్యంతరం లేదు. దేశంలో ఆయన అధికారానికి ఆటంకాలు ఉండవు. ఉ.కొరియా మరింత ధనిక దేశంగా అవతరిస్తుంది. ఒకవేళ సింగపూర్లో జరిగే చారిత్రక భేటీ విఫలమైతే, లిబియా నేత గడాఫీకి ఎలాంటి పరిస్థితి ఎదురైందే అలాంటి పరిస్థితి కిమ్ జోంగ్ ఉన్కు ఎదురవుతుంది. లిబియాలో తిరుగుబాటుదారులు ప్రభుత్వాన్ని కూల్చి, గడాఫీని దారుణంగా చంపేశారు. అమెరికా-ఉ.కొరియా మధ్య ఒప్పందం కుదరకపోతే 'లిబియా' పరిణామాలు మళ్లీ పునరావృతమవుతాయి. కిమ్ జోంగ్ ఉన్ నెల వ్యవధిలోనే రెండుమార్లు చైనాలో పర్యటించాడు. చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ను కలుసుకున్నాడు. ఆ తర్వాత సింగపూర్ భేటీపై కిమ్ స్వరంలో మార్పు వచ్చింది. చూద్దాం...ఏం జరుగుతుందో..!'' అని అన్నారు. ట్రంప్ వ్యాఖ్యలను ఉ.కొరియా ఖండించింది.