Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కిమ్తో భేటీపై ట్రంప్ యూటర్న్
- 'అణు' కేంద్రాన్ని ధ్వంసం చేసిన ఉ.కొరియా
వాషింగ్టన్ / ప్యాంగాంగ్: అంతర్జాతీయ ఒప్పందాలను, నిబంధనలను వరుసగా తుంగలో తొక్కుతూ వస్తున్న అమెరికా మరోమారు నమ్మక ద్రోహానికి పాల్పడింది. ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్తో శిఖరాగ్ర సదస్సును రద్దు చేసుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం ప్రకటించి అంతర్జాతీయ సమాజానికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయారు. ఇటీవలి ప్రకటనల్లో కిమ్ తమ పట్ల 'ఎనలేని ఆగ్రహం..బహిరంగ వైరం' ప్రదర్శించారనే నెపాన్నిఈ సదస్సు రద్దుకు కారణంగా ట్రంప్ పేర్కొన్నారు. మరోవైపు ఉత్తర కొరియా ప్రభుత్వం అంతర్జాతీయ మీడియా సమక్షంలోనే అణు పరీక్ష కేంద్రాలను ధ్వంసం చేసిన ఇచ్చిన హామీని నిలబెట్టుకుంది. షెడ్యూలు ప్రకారం సింగపూర్లో జూన్ 12న ట్రంప్-కిమ్ సదస్సు జరగాల్సివుండేది. కొన్ని వారాలుగా దీనిపై ఇరు దేశాలూ కసరత్తు చేస్తూ వచ్చాయి. అయితే అమెరికా చర్చలకు సిద్ధమంటూనే అనేక షరతలూ, డిమాండ్లనూ తెరపైకి తీసుకొస్తూ చర్చలపై అయోమ యస్థితిని కొనసాగిస్తూ వచ్చింది. తమ నిర్బం ధంలో ఉన్న అమెరికా ఖైదీలను రెండు వారాల కిందటే విడుదల చేసి ఉత్తర కొరియా సదస్సుకు అవకాశాలను మరింత పెంపొందిం చింది. తాజా రద్దు ప్రకటనకు కొన్ని గంటల ముందు అంటే ఉత్తర కొరియా అణు కేంద్ర సొరంగాలను ధ్వంసం చేసేవరకూ కూడా కిమ్తో భేటీ ఉండితీరుతుందని స్పష్టం చేసి అంతలోనే ట్రంప్ మాట తప్పారు. 'దీర్ఘకాలంగా జరపాలనుకుంటూవస్తున్న మన సమావేశం ప్రస్తుత తరుణంలో తగదని నేను భావిస్తున్నాను' అంటూ కిమ్ జోంగ్ ఉన్కు ట్రంప్ రాసిన లేఖను వైట్హౌస్ గురువారం విడుదల చేసింది. 'ప్రపంచం.. ప్రత్యేకించి ఉత్తర కొరియా సుస్థిర శాంతి, సౌఖ్యాలను, గొప్ప సంపద పొందే గొప్ప అవకాశాన్ని కోల్పోయింది' అని ట్రంప్ పేర్కొన్నారు. మనసు మార్చుకుంటే ఆ తర్వాత సదస్సుకు అవకాశముంటుందని ధర్మోపదేశం చేయడం విశేషం.
గందరగోళ ప్రకటనలు..రెచ్చగొట్టే వ్యాఖ్యలు
కిమ్-ట్రంప్ సదస్సుపై మొదట నుంచి అమెరికా గందరగోళ ప్రకటనలు చేస్తూ వచ్చింది. ఆ దేశ ఉపాధ్యక్షులు మైక్ పెన్స్ ఏకంగా లిబియాలో గడాఫి పతనంతో పోలుస్తూ ఉత్తర కొరియాను రెచ్చగొట్టే రీతిలో వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఉత్తర కొరియా ధీటుగా స్పందించి 'చర్చ ల సమ యం లో ఇది సరైన పద్ధతి కాదని' స్పష్టం చేసింది. ట్రంప్ సైతం నిలక డలేని ప్రకటనలు చేస్తూ వచ్చారు. కిమ్తో సదస్సుకు 'గొప్ప అవకాశం' ఉందనీ, ఒక వేళ కార్యరూపం దాల్చకపోతే సమావేశం వాయిదా పడవచ్చని మంగళవారం పేర్కొన్న ట్రంప్..దీనిపై వచ్చే వారంలో నిర్ణయం తీసుకుంటామని బుధవారం నాడు ప్రకటించారు. గురువారం ఉదయం ఫాక్స్ న్యూస్ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉత్తర కొరియా తో సదస్సు 'గొప్ప అవకాశం' అని ట్రంప్ వ్యాఖ్యానించారు. అంతలోనే సాయంత్రానికల్లా యూటర్న్ తీసుకొని సదస్సు రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించారు. అణ్వాయుధాలు వదులుకోకపోతే 'లిబియా తరహాలో అంతం' తప్పదంటూ అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ చేసిన హెచ్చరికలు మూర్ఖత్వంతో చేసిన అహంకార వ్యాఖ్యలంటూ ఉత్తర కొరియా తీవ్రంగా స్పందించిన వెనువెంటనే సదస్సును రద్దు చేసుకుంటున్నట్లు ట్రంప్ ప్రకటించారు. 'మీరు అణు సామ ర్థ్యాల గురించి మాట్లాడుతున్నారు. మా వద్ద వాటికంటే శక్తివంతమైన భారీ ఆయుధాలున్నాయి. వాటిని వినియో గించే సమయం ఎప్పుడూ రాకూడదని దేవుణ్ని ప్రార్థిస్తున్నా' అంటూ కిమ్కు రాసిన లేఖలో ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా ఖైదీల విడుదల పట్ల కృతజ్ఞతలు కూడా ఆయన ఈ లేఖలో కిమ్కు తెలియజేశారు. ట్రంప్ నిర్ణయంపై డెమొ క్రాట్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంప్ యంత్రాంగం చేస్తున్న స్వీయ తప్పిదాలే పెను నష్టాలకు దారితీస్తాయని మెచ్చరించారు. 'ఒప్పందాల కళ కంటే దౌత్య కళ చాలా కష్టతరమైనదన్న సంగతి ట్రంప్ యంత్రాంగం గుర్తించాలని డెమొక్రాట్ సీనియర్ నేత, న్యూజెర్సీ సెనెటర్ బాబ్ మెండేజ్ తెలిపారు. వైట్ హౌస్ పదేపదే 'లిబియా తరహా మోడల్'ను ఎందుకు ప్రస్తావిస్తోం దని ఆయన ప్రశ్నించారు.
అంతర్జాతీయ మీడియా సమక్షంలో అణు సొరంగాల ధ్వంసం
ఉత్తరకొరియాలోని పంగెయి-రి వద్ద గల అణ్వాయుధ కేంద్రానికి సంబంధించిన అణు పరీక్షలను నిర్వహించే సొరంగాలను ఉత్తరకొరియా ధ్వంసం చేసింది. వీటిలో ఇటీవల అణు పరీక్షలు నిర్వహించిన సొరంగాలు కూడా ఉన్నాయి. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన పాత్రికేయుల సమక్షంలోనే ఈ అణు విధ్వంస కార్యాచర ణను చేపట్టారు. అణు పరీక్షల కోసం ఉపయోగించిన మూడు సొరంగాలను ధ్వంసం చేయడాన్ని జర్నలిస్టులకు చూపించారని ప్రత్యక్షంగా వీక్షించిన జర్నలిస్టుల్లో ఒకరైన 'రష్యా టుడే' విలేకరి ఇగర్ జొదనొవ్ తెలిపారు. ధ్వంసం చేసిన వాటిలో ఒకటైన ఉత్తర ప్రాంత సొరంగాన్ని ఇటీవల అణు పరీక్షల కోసం విస్తృతంగా ఉపయోగించారని ఆయన తెలిపారు. మిగిలిన రెండు సొరంగాలు కొత్తవని, సమీప భవిష్యత్తులో అణు పరీక్షలకు వీటిని ఉపయోగించే అవకాశం వున్న నేపథ్యంలో వాటినీ ధ్వంసం చేశారని తెలిపారు. సుస్థిర శాంతి కోసం అవసరమైతే ఎంతటి త్యాగానికైనా కొరియన్లు సిద్ధపడుతారనే విషయం ఈ సొరంగాల విధ్వంసం చూస్తే తెలుస్తుందని జొదనొవ్ వ్యాఖ్యానించారు. సొరంగాన్ని పేల్చి వేయడానికి జరిపిన పేలుళ్ళు చాలా శక్తివంతమైనవని, వాటి ప్రభావంతో చిన్నపాటి భూ ప్రకంపనలు సంభవించాయని తెలిపారు. అణు పరీక్ష కేంద్రం వద్ద గల సెక్యూరిటీ చెక్ఫాయింట్లు,, బ్యారక్లతో సహా అన్ని మౌలిక సదుపాయాలు పూర్తిగా ధ్వంసమయ్యా యని తెలిపారు. అణు రహిత ప్రపంచాన్ని నిర్మించేందుకు తన వంతు సహకారాన్ని అందించేందుకు ఉత్తర కొరియా కట్టుబడి వుందని గురువారం దేశ అణ్వాయుధ సంస్థ స్పష్టం చేసింది.
ఇక భవిష్యత్తులో ఆ కేంద్రం వద్ద ఎలాంటి పరీక్షలు నిర్వహించడం అసాధ్యమని తెలిపింది. ఈ పరీక్ష కేంద్రాన్ని మూసివేస్తామని ఏప్రిల్లో ఉభయ కొరియాల శిఖరాగ్ర సదస్సు అనంతరం ఉత్తర కొరియా అంతర్జాతీయ సమాజానికి హామీ ఇచ్చింది. ఇచ్చిన మాట ప్రకారమే తన వాగ్దానాన్ని నిలబెట్టుకుంది.