Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సియోల్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో చర్చలు జరిపేందుకు 'ఎప్పుడైనా, ఏ విధంగానైనా' తాము సిద్ధంగా ఉన్నామని ఉత్తర కొరియా ప్రకటించింది. కిమ్ జోంగ్ ఉన్తో భేటీని రద్దు చేసుకుంటున్నట్టు ట్రంప్ అర్థాంతరంగా ప్రకటించిన తర్వాత ఈ ప్రకటన వెలువడింది. ట్రంప్ నిర్ణయం దురదృష్టకరమని ఉత్తరకొరియా విదేశాంగ శాఖ ఉప మంత్రి కిమ్ కై గ్వాన్ తెలిపారు. తాము ప్రపంచ శాంతిని కోరుకుంటున్నామని అన్నారు. విదేశీ మీడియా సమక్షంలో అణ్వాయుధ ప్రయోగ టన్నెల్స్ను పేల్చేశామన్నారు. ఉభయ కొరియా ప్రజల అభీష్టం మేరకు అమెరికాతో చర్చలు జరపాలని ఆకాంక్షిస్తున్నామని అన్నారు. అమెరికాతో చర్చలకు సిద్ధంగా ఉన్నామని కిమ్ ప్రకటించినట్టు ఆ దేశ అధికారిక మీడియా కేసీఎన్ఏ వెల్లడించింది.
కాగా, ట్రంప్, కిమ్ మధ్య వచ్చేనెల 12న సింగపూర్లో భేటీ జరగాల్సి ఉంది. అయితే ఈ సమావేశాన్ని రద్దు చేసుకున్నట్టు ట్రంప్ గురువారం ప్రకటించారు. ఈ మేరకు కిమ్కు లేఖ కూడా పంపించారు. 'మీతో భేటీ అవ్వడానికి నేను ఆస్తక్తిగా ఎదురు చూశాను. కానీ, దురదృష్టవశాత్తూ ఇటీవల మీరు చేసిన ప్రకటనల్లో అమెరికాపై ఎంతో ద్వేషం, శత్రుత్వ వైఖరిని ప్రదర్శించారు. ఇటువంటి పరిస్థితుల్లో దీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న ఈ భేటీ అనవసరం అనిపించింది' అని ట్రంప్ ఈ సందర్భంగా లేఖలో పేర్కొన్నారు. ఉత్తరకొరియాలో అణు పరీక్షా కేంద్రాన్ని పేల్చేసిన కొద్ది గంటలకే ట్రంప్ సమావేశాన్ని రద్దు చేయడం గమనార్హం.
ఇరు దేశాల మధ్య చర్చలు జరగాలి : దక్షిణకొరియా
తాజా పరిణామాల నేపథ్యంలో అమెరికా, ఉత్తర కొరియా మధ్య చర్చలు జరిగేలా చూసేందుకు దౌత్యపరమైన ప్రయత్నాలు కొనసాగించాలని దక్షిణ కొరియా నిర్ణయించింది. ఉభయ కొరియాల పునరేకీకరణ వ్యవహారాల శాఖ ప్రతినిధి బేక్ తై హుయూన్ పత్రికా సమావేశంలో మాట్లాడుతూ, చర్చల ప్రక్రియ చెదరకుండా ఉండేలా కృషి చేస్తామని అన్నారు. సమస్యలు చర్చల ద్వారానే పరిష్కారమవుతాయని పేర్కొంటూ సంబంధిత పక్షాలు తమ వైఖరులు మార్చుకోరాదని పేర్కొన్నారు. ట్రంప్ ప్రకటన నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు వెలువడ్డాయి. అధ్యక్షుడు మూన్ జే ఇన్ తక్షణమే సీనియర్ భద్రతా, దౌత్య సలహాదారులతో అత్యవసర సమావేశం జరిపారు. ఇప్పటి చర్చలు రద్దైనప్పటికీ భవిష్యత్తులో ఏదో ఒక రోజు కిమ్తో సమావేశమవడం కోసం ఎదురుచూస్తున్నానని ట్రంప్ తెలిపారు.
ట్రంప్, కిమ్ నాణేనికి పెరిగిన డిమాండ్
ట్రంప్, కిమ్ మధ్య భేటీ జరుగుతుందో లేదో స్పష్టత లేదు. అయితే, సింగపూర్లో జూన్12న జరగాల్సిన వీరి భేటీ నేపథ్యంలో విడుదలైన స్మారక నాణేనికి మాత్రం ట్రంప్ ప్రకటన తర్వాత మరింత డిమాండ్ పెరిగింది. ఎంతలా అంటే.. దీన్ని విక్రయిస్తున్న వైట్ హౌస్ గిఫ్ట్ షాప్ వెబ్సైట్ క్రాష్ అయ్యేంతగా!! వాస్తవానికి ఇలాంటి నాణేలు రెండు ఉన్నాయి. అందులో ఒకటి.. అందరి దృష్టినీ ఆకర్షించింది వైట్ హౌస్ కమ్యూనికేషన్స్ ఏజెన్సీ (డబ్ల్యుహెచ్సీఏ) తయారు చేసిన ట్రంప్, కిమ్ నాణెం. ఈ ఏజెన్సీ తయారు చేసే నాణేలను విదేశీ అతిథులు, రాయబారులకు బహూకరి స్తుంటారు.మరొకటి, ట్రంప్, కిమ్ల తో పాటు దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే-ఇన్ ముగ్గురి ఛాయా చిత్రాలతో కూడిన నాణెం. దీన్నే వైట్ హౌస్ గిఫ్ట్ షాపు విక్రయిస్తోంది.
దీని వాస్తవ ధర 24.95 డాలర్లు ( రూ.1,693 ) కాగా.. భారీ రాయితీ కల్పించి 19.95 డాలర్లకే ( రూ.1, 354 ) దీన్ని అమ్మకానికి పెట్టింది. ఒకవేళ ఈ ఇద్దరు నాయకుల మధ్య భేటీ జరగకపోతే.. డబ్బుల్ని వెనక్కు ఇస్తామని కూడా చెబుతోంది.
నిరాయుధీకరణ, అణ్వస్త్ర ప్రయోగాల నిలిపివేత కోసం ప్రపంచ దేశాలన్నీ కృషి చేయాలి: ఐరాస
ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్య ద్వైపాక్షిక చర్చలు జరగాలని మెజారిటీ సభ్య దేశాలు కోరుతున్నాయని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటరస్ తెలిపారు. వచ్చేనెల 12న సింగపూర్లో ట్రంప్, కిమ్ మధ్య భేటీ రద్దు కావడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నిరాయుధీకరణ, అణ్వస్త్ర ప్రయోగాల నిలిపివేత కోసం ప్రపంచ దేశాలన్నీ కృషి చేయాలని కోరారు. జెనీవా యూనివర్సిటీలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అణ్వస్త్ర ప్రయోగాల త్యజింపుతో మానవాళి మనుగఢ సాధ్యమవుతుందన్నారు. ఆయుధాల భాండాగారాల నిర్మాణాలు, నూతన ఆయుధాల తయారీపై ఇటీవలి కాలంలో అనేక దేశాలు దృష్టిపెడుతున్నాయని అన్నారు.
పలు దేశాల్లో అమాయక ప్రజలపై రసాయనిక ఆయుధాల ప్రయోగం జరుగుతోందన్నారు. మానవాళి మనుగఢకు ముప్పుగా మారిన అణ్వస్త్ర పరీక్షలను ప్రపంచ దేశాలు నిలిపివేయాలని అభ్యర్థించారు.
అనంతరం కాంగోలో ఎబోలా వైరస్ విజృంభనపై మాట్లాడారు. ఎబోలా వైరస్ కారణంగా అక్కడి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, ప్రపంచ దేశాల సాయం కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు.