Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రపంచ వ్యాప్తంగా 6.85కోట్ల మంది స్వదేశాలను విడిచిపెట్టారు : ఐరాస
జెనీవా: అంతర్యుద్ధాలు చెలరేగడంతో శరణార్థుల జనాభా పెరుగుతోందని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా 6.85కోట్ల మంది అంతర్యుద్ధాల ఫలితంగా తమ స్వదేశాలను వదిలిపెట్టి ఇతర ప్రాంతాలకు తరలివెళ్లారని ఐరాస పేర్కొంది. ఈ మేరకు ఓ నివేదికను విడుదల చేసింది. దానిలోని వివరాల ప్రకారం...ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు నిత్యం అల్లర్లు, యుద్ధాలు, మారణహోమాలతో వణికిపోతున్నారు. ఈ భీతావహ వాతావరణం నుంచి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పొరుగు దేశాలకు వలసపోతున్నారు. గతేడాది చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా 6.85కోట్ల మంది ప్రజలు తమ స్వదేశాలను వదిలిపెట్టి వెళ్లారు. ప్రపంచం మొత్తం మీద ప్రతి 110 మందిలో ఒకరికి బలవంతంగా తమ దేశాన్ని విడిచిపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సంఖ్య థారులాండ్ దేశంలోని మొత్తం జనాభాతో సమానం. ఇతర ప్రాంతాలకు వలసవెళ్తున్న వారిలో 70శాతం మంది కేవలం 10 దేశాలకు చెందినవారే కావడం గమనార్హం.ఈ 10 దేశాల్లోని పరిస్థితులు మెరుగుపడితే తప్ప ఇలా స్వదేశాలను విడిచిపెట్టేవారి సంఖ్య తగ్గదని ఐరాస శరణార్థ విభాగం హైకమిషనర్ ఫిలిప్పో గ్రాండీ అన్నారు.
ఒక్క 2017లోనే 1.62కోట్ల మంది ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లినట్టు ఐరాస పేర్కొంది. మయన్మార్, సిరియా, అఫ్ఘనిస్థాన్ లాంటి దేశాల్లో హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. ఈ దేశాల నుంచే ఎక్కువగా ప్రజలు వలసవెళ్తుంటారు. గతేడాది చివరి నాటికి సిరియా నుంచి 63లక్షల మందికి పైగా ప్రజలు వేరే దేశాలకు వలసవెళ్లారు. ఇక సూడాన్లోనూ 24లక్షల మంది పొరుగు దేశాలకు వెళ్లిపోయారు. ఇక గతేడాది మయన్మార్లోని రఖైన్ జిల్లాలో రోహింగ్యా ముస్లింల ఊచకోత గురించి తెలిసిందే. మయన్మార్ ఆర్మీ ఆగడాలను తట్టుకోలేక లక్షల మంది రోహింగ్యాలు బంగ్లాదేశ్ సరిహద్దులకు పారిపోయారు.