Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్: అక్రమ వలసదారుల నుంచి వారి పిల్లలను వేరు చేయడంపై ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గారు. అమెరికా-మెక్సికో సరిహద్దులో వలసదారుల పిల్లలను తల్లిదండ్రుల నుంచి దూరం చేయకూడదనే ఆదేశాలపై తాజాగా సంతకం చేశారు. ఇక దేశంలోని వలస కుటుంబాల వారంతా ఒకే చోట ఉండవచ్చని భరోసా ఇచ్చారు. తాజా ఆదేశాల ప్రకారం అక్రమ వలసదారులను విచారించే సమయంలో వారి పిల్లలను నిర్బంధ శిబిరాల్లో ఉంచుతున్నారు. అయితే ఇప్పుడు కుటుంబాన్ని కలిపి ఉంచే విచారణ చేపట్టాలంటూ ట్రంప్ ఆదేశించడం గమనార్హం. తల్లిదండ్రులను అరెస్ట్ చేయడం వల్ల పిల్లలపై దాని దుష్ప్రభావం పడుతుందని అనిపిస్తే మాత్రం, వారిని విడిగా ఉంచుతారు. కానీ, పిల్లలను వాళ్ల అమ్మనాన్నల నుంచి ఎంత కాలం పాటు దూరంగా ఉంచుతారు అనేది ఈ ఆదేశాలలో స్పష్టంగా పేర్కొనలేదు. ట్రంప్ ఆదేశాలు ఎప్పటి నుంచి అమలవుతాయి అనేదానిపై కూడా ఇంకా స్పష్టత రాలేదు. ఇమిగ్రేషన్ కేసులను పరిష్కరించేందుకు ఒకే కుటుంబానికి చెందిన సభ్యులందరినీ అదుపులోకి తీసుకుంటామని ట్రంప్ తన ఆదేశాల్లో పేర్కొన్నారు.
తల్లిదండ్రుల కోసం విలపిస్తున్న చిన్నారుల దృశ్యాలను చూసి తన మనస్సు చెలించిందని ట్రంప్ పేర్కొన్నారు. పిల్లలను, తల్లిదం డ్రులను వేరు చేయడం సరైన నిర్ణయం కాదని తెలుసుకున్నానని అన్నారు. భార్య మెలానియా, కూతురు ఇవాంక కూడా కుటుంబాలు ఒక్కటిగా ఉండాలనే విధానాన్ని సమర్థించారని ట్రంప్ తెలిపారు. వలసదారులపై చేసిన వివాదాస్పద చట్టాన్ని సరళతరం చేయాలని భార్య మెలనియా, కుమార్తె ఇవాంక ట్రంప్పై ఒత్తిడి తెచ్చినట్టు మీడియా నివేదికలు చెబుతున్నాయి. ట్రంప్ తాజా ఆదేశాలపై సంతకాలు చేసిన కాసేపటికి అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తన ఫేస్బుక్లో.. శరణార్థులు, వలసదారులకు స్వాగతం పలికే ఆలోచనను కనుగొనడమే అమెరికా సంప్రదాయం అయ్యిందంటూ పోస్ట్ చేశారు. ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీ సభ్యులు తన పనికి అడ్డు తగులుతున్నారంటూ అంతకు ముందు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. వలసదారుల కోసం రూపొందించిన తన 'జీరో టాలరెన్స్ పాలసీ'ని ఆయన సమర్థించుకున్నారు. లక్షల మంది వలసదారులకు చోటిచ్చి యూరోపియన్ దేశాలు చాలా పెద్ద తప్పు చేశాయని కూడా ట్రంప్ అన్నారు.
చట్టంపై ఎందుకీ వివాదం?
ట్రంప్ పాలనలోని వివాదాస్పద చట్టం ప్రకారం అమెరికా సరిహద్దుల్లో అక్రమంగా చొరబడ్డ వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తారు. వారికి జైలు శిక్ష విధిస్తారు. అలాంటి వలసదారులు వారి పిల్లలను కూడా కలవనీయకుండా విడిగా ఉంచుతారు. తల్లిదండ్రులకు దూరమైన ఈ పిల్లలను అమెరికాలోని 'డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్' చూసుకుంటుంది. అంతకు ముందు ఏ పత్రాలూ లేకుండా మొదటిసారి సరిహద్దులు దాటిన వలసదారులను కోర్టులో నిలబెట్టేవారు. సమన్లు పంపినా అక్రమ వలసదారులు కోర్టుకు హాజరు కాలేదని అందుకే వారిపై క్రిమినల్ కేసులు పెట్టామని అమెరికా అధికారులు చెప్పేవారు. కొత్త చట్టం ప్రకారం అక్రమంగా సరిహద్దులు దాటిన వారిని అదుపులోకి తీసుకుని, జైల్లో పెడతారు. కానీ కుటుంబంలో అందరినీ కలిపే ఉంచుతారు. ట్రంప్ కొత్త ఆదేశాలతో, అక్రమ వలసదారులపై అమెరికా 'జీరో టాలరెన్స్ పాలసీ' ముందు లాగే అమలవుతుందనేది కూడా స్పష్టమవుతోంది.
పిల్లల ఫొటోలతో రాజుకున్న వివాదం
గొలుసులు వేసిన తలుపు వెనక వలసదారుల పిల్లలున్న కొన్ని ఫొటోలు సోషల్మీడియాలో రావడంతో ట్రంప్ పాలనలోని వలస చట్టాలు మరింత వివాదాస్పదమయ్యాయి. ఈ ఫొటోలు బయటికి రావడంతో పిల్లల కోసం ఏర్పాటు చేసిన ఈ సంరక్షణ కేంద్రాలను నాజీ నిర్బంధ శిబిరాలతో పోల్చారు. అమెరికా ప్రభుత్వం గణాంకాల ప్రకారం ఈ ఏడాది మే5 నుంచి జూన్9 మధ్య 2,342 మంది వలసదారుల పిల్లలు వారి తల్లిదండ్రులకు దూరమయ్యారు. పిల్లలను వారి కుటుంబాలకు దూరం చేయడం క్రూరమైన, అమానవీయ చర్యగా మెక్సికో విదేశాంగ మంత్రి లూయిస్ విదేగరా కాసో విమర్శించారు.