Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉభయ ప్రధానుల అంగీకారం
బీజింగ్: నేపాల్, చైనా మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని ఉభయ దేశాల ప్రధానులు కేపీ శర్మ ఓలి, లీ కెకియాంగ్లు నిర్ణయించారు. ప్రస్తుతం చైనాలో పర్యటిస్తున్న నేపాల్ ప్రధాని ఓలి చైనా ప్రధాని లీ కెకియాంగ్తో చర్చలు జరిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నేపాల్, చైనా మంచి మిత్రదేశాలు మాత్రమే కాక ప్రగతి భాగస్వాములని, ఇరుదేశాలను పర్వతశ్రేణులు, నదులు అనుసంధానిస్తున్నాయని చెప్పారు. ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడిన తరువాత పంచశీల ఆధారంగా స్నేహ, సహకార సంబంధాలు మరింత బలోపేతమయ్యాయని లీకెకియాంగ్ గుర్తు చేశారు. ఈ సంబంధాలను మరింత పునరుత్తేజింప చేసి ద్వైపాక్షిక, సహకార సంబంధాలలో కొత్త అధ్యాయానికి తెరతీసే కృషిలో సహకరించేందుకు చైనా సిద్ధంగా వుందన్నారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతమైతే అది ఇరుదేశాలకు మాత్రమే కాక ప్రాంతీయంగా శాంతి, సుస్థిరత, ప్రగతికి దోహదపడతాయన్నారు. తమ కంపెనీలు నేపాల్లో పెట్టుబడులు పెట్టేందుకు చైనా సుముఖంగానే ఉందని, ఇరుదేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి (ఎఫ్టీఏ) సంబంధించిన చర్చలు త్వరలో ప్రారంభమవుతాయని ఆశిస్తున్నామని ఆయన చెప్పారు. ఐరాస, షాంఘై సహకార సంస్థ, ఆసియాన్, తదితర సంస్థల్లో నేపాల్ ప్రయోజనాల పరిరక్షణకు చైనా అన్ని వేళలా సహకరిస్తుందన్నారు. ఈ మీడియా సమావేశంలో పాల్గొన్న నేపాల్ ప్రధాని ఓలి మాట్లాడుతూ అంతర్జాతీయ రాజకీయ, ఆర్థిక వ్యవహారాలలో చైనా పోషిస్తున్న సానుకూల పాత్రను ప్రశంసించారు.