Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లండన్: అమెరికా వస్తువులపై సుంకాలు మోపేందుకు యూరోపియన్ యూనియన్ (ఈయూ) సన్నద్ధమైంది. అమెరికా వస్తువులపై ఇప్పటికే భారత్, చైనా వాణిజ్యపోరు ప్రకటించిన సంగతి తెలిసిందే. సుమారు 3.2 బిలియన్ డాలర్ల (రూ. 21,724 కోట్లు) విలువైన అమెరికన్ వస్తువులపై సుంకాలను విధించనున్నట్టు ఈయూ పేర్కొన్నది. దిగుమతి చేసుకున్న ఉక్కు మరియు అల్యూమినియంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకం విధింపు అనంతరం ఈ వాణిజ్య పోరు మొదలైంది. సుంకాలను పెంచుతామని ట్రంప్ తొలుత ప్రతిపాదించినప్పుడే తాము కూడా ప్రతీకార చర్యలు చేపడతామని హెచ్చరించిన ఈయూ ఇపుడు అన్నంత పనీ చేసింది.
అమెరికా ఉత్పత్తులపై దిగుమతి సుంకాన్ని పెంచనున్నట్టు ప్రకటించింది. 3.2 బిలియన్ డాలర్ల విలువైన అమెరికన్ వస్తువులపై టారిఫ్లను శుక్రవారం నుంచి అమలు చేయనున్నట్టు వెల్లడించింది. విస్కీ, పొగాకు, హార్లీ డేవిడ్ సన్ బైక్స్, కాన్బెర్రీ, పీనట్ బటర్లాంటి అమెరికా ఉత్పత్తులపై 25శాతం దిగుమతి సుంకాన్ని పెంచింది. దీంతోపాటు పాదరక్షలు, కొన్నిరకాల దుస్తులు, వాషింగ్ మెషీన్లు తదితర ఎంపిక చేసిన కొన్ని అంశాలపై 50శాతం వరకు పన్నును పెంచింది. యూరోపియన్ కమిషన్ అధ్యక్షుడు జీన్క్లాడ్ జంకర్ ఐరిష్ పార్లమెంటులో మాట్లాడుతూ ఈ విషయమై కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు చెప్పారు.
సుంకం విధింపులతో అమెరికా చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తోందని వాఖ్యానించారు. అమెరికా సుంకాల నేపథ్యంలో తమ ప్రతిస్పందన స్పష్టంగా ఉంటుందన్నారు. అమెరికాకు చెందిన 29 ఉత్పత్తులపై దిగుమతి సుంకాన్ని పెంచినట్టు భారత్ ప్రకటించింది. ఆగస్టు నుంచి ఈ పెంచిన సుంకాలు అమల్లోకి రానున్నాయి.
కాగా, ఉక్కు దిగుమతులపై 25 శాతం, అల్యూమినియం దిగుమతులపై 10 శాతం సుంకాలను భారీగా పెంచి వాణిజ్య యుద్ధానికి తెర లేపిన ట్రంప్ ఈ విషయమై ఇతర దేశాలను కూడా బెదిరిస్తున్నారు. ఈ సుంకాలపై ఈయూ ప్రతీకార చర్యలకు దిగితే యూరప్ దేశాలకు చెందిన కార్లపై దిగుమతి సుంకాన్ని భారీగా పెంచుతామని ఆయన హెచ్చరించిన సంగతి తెలిసిందే.