Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జైలు అధికారికి లేఖ రాసిన నవాజ్ షరీఫ్
ఇస్లామాబాద్: అవినీతి కేసులో అరెస్టయిన పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్(68), ఆయన కుమార్తె మరియం (44)లను పోలీసులు రావల్పిండిలోని అడియాల జైలుకు తరలించిన విషయం తెలిసిందే. ఇస్లామాబాద్లోని సిహాల పోలీసు శిక్షణ కళాశాలలోని అతిథి గృహాన్ని సబ్జైలుగా మార్చాలని తొలుత అనుకున్నా, ఆ ప్రతిపాదనను విరమించుకొని వారిద్దరినీ అడియాలకు పంపించారు. అక్కడ వారికి 'బి' శ్రేణి సౌకర్యాలను కల్పించారు. అయితే, జైళ్ల శాఖ అధికారులు కల్పించిన సౌకర్యాలు తనకు ఏమాత్రం సరిపోవడం లేదంటూ నవాజ్ ఆరోపించారు.
ఈమేరకు తనకు 'ఏ' శ్రేణి సదుపాయాలు కావాలంటూ జైలు సూపరింటెండెంట్కు లేఖ రాశారు. ఇందులో భాగంగా తనకు కేటాయించిన మంచం, టేబుల్, చైర్, సీలింగ్ ఫ్యాన్, 21అంగుళాల టీవీ, వార్త పత్రిక వంటి సౌకర్యాలు తనకు సరిపోవడం లేదని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఒక మాజీ ప్రధాని హోదాలో తనకు సౌకర్యాలు కల్పించడం లేదన్నారు.
మరోవైపు షరీఫ్ కుమార్తె మరియం జైల్లో తనకెలాంటి ప్రత్యేక సౌకర్యాలు అవసరం లేదంటూ జైళ్ల శాఖకు లేఖ రాశారు. నిబంధనల్లో భాగంగా షరీఫ్, మరియంకు 'బీ' శ్రేణి సౌకర్యాలు కల్పించిన విషయం తెలిసిందే. వీటన్నింటినీ ప్రస్తావిస్తూ ఆమె లేఖ రాశారు. ''ప్రభుత్వ నిబంధనల్లో భాగంగా జైల్ సూపరింటెండెంట్ మాకు ఉన్నత శ్రేణి సౌకర్యాలు కల్పించారు. వీటన్నింటినీ నేను తిరస్కరిస్తున్నాను. ఇది పూర్తిగా నేను తీసుకున్న నిర్ణయమే. ఇందులో ఎవరి జోక్యం లేదు'' అని లేఖ రాశారు.
పనామా పత్రాల కుంభకోణానికి సంబంధించి అవెన్ఫీల్డ్ హౌస్ అక్రమాస్తుల కేసులో షరీఫ్, మరియంలను న్యాయస్థానం ఈ నెల 6న దోషులుగా తేల్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో షరీఫ్కు పదేండ్లు, మరియంకు ఏడేండ్లు జైలు శిక్ష విధించింది.