Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విసిగిపోయిన అమెరికన్ యువత
- తాజా సర్వేలో వెల్లడి
వాషింగ్టన్: అమెరికాలోని అధికశాతం మంది యువత పెట్టుబడిదారీ విధానంతో విసిగిపోతున్నారని తాజా అధ్యయనంలో వెల్లడయింది. అయితే అమెరికా పాలక వర్గాలు మాత్రం పెట్టుబడిదారీ వ్యవస్థనుంచి పక్కకు మళ్లేందుకు విముఖత చూపుతుండటం వల్లే ట్రంప్ ప్రభుత్వం ఎన్నికయిందని గాలప్ పోల్ నిర్వహించిన ఈ అధ్యయన నివేదిక స్పష్టం చేసింది. ఈ సర్వే ప్రకారం డెమొక్రాట్లలో 57 శాతం మంది సోషలిజం పట్ల సానుకూలంగా స్పందించగా కేవలం 47 శాతం మంది మాత్రమే పెట్టుబడిదారీ విధానంపై మొగ్గు చూపారు. 2010లో నిర్వహించిన ఇటువంటి సర్వేలో పెట్టుబడిదారీ విధానంపై మొగ్గుచూపే వారి సంఖ్య 56 శాతంగా తేలిన విషయం తెలిసిందే. రాజకీయంగా పరిశీలిస్తే 18-29 ఏండ్ల మధ్య వయస్కులైన అమెరికన్ యువత కేపిటలిజం, సోషలిజం మధ్య చీలిపోయారు. 51 శాతం మంది యువత సోషలిజంవైపు మొగ్గు చూపుతుండగా 45 శాతం మంది మాత్రమే పెట్టుబడిదారీ విధానం పట్ల సానుకూలంగా స్పందించారు. పెట్టుబడిదారీ విధానం పట్ల అమెరికన్ యువత విసుగెత్తి పోవటానికి కారణాలను సులభంగానే అర్ధం చేసుకోవచ్చని ప్రముఖ సామాజిక కార్యకర్త స్లవోజ్ జిజెక్ అభిప్రాయపడ్డారు. అమెరికన్ల డాలర్ స్వప్నం సాకారం కాకపోవటంతోనే యువతలో ఈ మార్పు కన్పిస్తోందని ఆయన అంటున్నారు. కార్మిక, ఉద్యోగ వర్గాలు కూడా పెట్టుబడిదారీ విధానంపట్ల విముఖంగా వున్నాయని, అమెరికన్ వ్యవస్థ ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేయటం లేదన్న భావన ఇటు యువతలోనూ, అటు ఇతర వర్గాల ప్రజల్లోనూ విస్తృతంగా వ్యాపిస్తోందని ఆయన చెప్పారు. అమెరికన్ ఆర్థిక వ్యవస్థ మాంద్యం నుండి పుంజు కుంటున్న సమయంలో దేశ ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుం డటం గమనార్హం. దేశంలో ప్రస్తుత నిరుద్యోగిత రేటు అర్ధశతాబ్ది కాలంలో సగానికి తక్కువగా మూడు శాతం మేర నమోదవుతోంది. వేతనాలు పెరుగుతున్నాయి. అధ్యక్షుడు ట్రంప్ మాటల ప్రకారం అధికశాతం కంపెనీలు ఇతర దేశాలలో కొనసాగిస్తున్న తమ ఉత్పత్తి కార్యకలాపాలను స్వదేశానికి తీసుకు వచ్చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో అమెరికన్లలో వ్యవస్థపై అసంతృప్తి పెరుగుతుండటం విశేషం.