Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రంగం సిద్ధమైందన్న అధ్యక్షుడు ట్రంప్
- ఈసారి 200 బి.డాలర్ల ఉత్పత్తులపై పన్ను విధింపు
వాషింగ్టన్ : చైనా దిగుమతులపై మరో దఫా పన్ను టారీఫ్లు విధించడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రంగం సిద్ధం చేశాడు. ప్రభుత్వ ఖజానా కార్యదర్శి స్టీవెన్ మ్నూన్చిన్ ఓవైపు చైనాతో వాణిజ్య చర్చలకు సమాయత్తమవుతుంటే, మరోవైపు ట్రంప్ చైనా దిగుమతులపై 200 బిలియన్ డాలర్ల (1 బి.డాలరు... రూ.7210కోట్లు) పన్ను టారీఫ్లు విధించాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి కార్యాచరణ రూపొందించి, ముందుకెళ్లాలని సంబంధిత అధికారుల్ని ట్రంప్ ఆదేశించారు. అయితే ఎప్పట్నుంచీ ఈ పన్ను విధింపు అమల్లోకి వస్తుందన్నది ఇంకా తెలియరాలేదు. ఇప్పటికే 50 బిలియన్ డాలర్ల చైనా దిగుమతులపై ట్రంప్ పన్ను టారీఫ్ను విధించిన సంగతి తెలిసిందే.
చైనా దిగుమతులపై మరిన్ని పన్ను టారీఫ్లు విధించనున్నారని 'బ్లూమ్బర్గ్' మీడియా పేర్కొనటం, స్టాక్మార్కెట్ను ప్రభావితం చేసింది. వారంరోజుల క్రితం పన్ను టారీఫ్ల గురించి ట్రంప్ మీడియా ముందు ప్రస్తావించారు. 200 బిలియన్ డాలర్లు, అటు తర్వాత 267 బిలియన్ డాలర్ల చైనా దిగుమతులపై పన్నులు విధించాలని తాను నిర్ణయించుకుంటే అందుకు ఒక చిన్న ఆదేశం సరిపోతుందని అన్నారు.
ఇంటర్నెట్ సాంకేతిక ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్స్, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులు, నిత్యావసర వస్తువులు, హ్యాండ్బ్యాగ్స్, సైకిళ్లు, ఫర్నిచర్...మొదలైన చైనా దిగుమతులపై పన్ను టారిఫ్ను విధించనున్నట్టు తెలుస్తోంది. ప్రపంచంలోనే రెండు అతిపెద్ద ఆర్థికవ్యవస్థలైన..అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధానికి అధ్యక్షుడు ట్రంప్ తెరలేపటం అనేక దేశాల్ని ఆందోళనకు గురిచేస్తున్నది.