Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరోలినా రాష్ట్రాల్లో 17 మంది మృతి
వాషింగ్టన్ : అమెరికాలోని ఉత్తర, దక్షిణ కరోలినా రాష్ట్రాల్లో ఫ్లోరెన్స్ తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. ఈ తుఫాను ధాటికి మృతి చెందినవారి సంఖ్య సోమవారం నాటికి 17కి చేరుకుంది. ఫ్లోరెన్స్ గురువారం క్యాటగిరీ-1 హరికేన్గా తీరాన్ని దాటినప్పటి నుంచి ఉత్తర కరోలినాలో 11 మంది, దక్షిణ కరోలినాలో ఆరుగురు వేర్వేరు ఘటనల్లో మృతి చెందారు. గురువారం నుంచి ఈ రెండు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో వంద సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. ఇది అత్యంత ప్రమాదకరమైన తుఫాను అని ఉత్తర కరోలినా గవర్నర్ రారు కూపర్ తెలిపారు. ఉత్తర కరోలినాలో ఎక్కడైనా ఆకస్మిక వరదలు సంభవించే ప్రమాదముందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. ఉత్తర కరోలినాలో దాదాపు 900 మందిని సహాయ బృందాలు రక్షించినట్టు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ఇంకా 15 వేల మంది అత్యవసర శిబిరాల్లో తలదాచుకున్నట్టు సమాచారం.
జలదిగ్బంధంలో విల్మింగ్టన్ :
ఉత్తర కరోలినాలోని తీర నగరం విల్మింగ్టన్ జల దిగ్బంధంలో చిక్కుకొంది. ఫ్లోరెన్స్ తుఫాను కారణంగా ఇతర ప్రాంతాలతో ఈ ప్రాంతానికి ఉన్న సంబంధాలు తెగిపోయాయి. రవాణా వ్యవస్థ దెబ్బతిన్నది. రోడ్లపై భారీగా వరదనీరు వచ్చి చేరిం ది. స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొం టున్నారు. విద్యుత్ వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వరద ఉధృతి అధికంగా ఉండటంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రావొద్దని అధికా రులు ఆదేశాలు జారీ చేశారు. అంతేగాకుండా, సుర క్షిత ప్రాంతాలకు తరలివెళ్లిన ప్రజలు అక్కడే ఉండా లని సూచించారు. వరదలు తగ్గుముఖం పట్టిన వెంటనే సమాచారం అందిస్తామని అధికారులు ప్రకటించారు. విల్మింగ్టన్ జనాభా దాదాపు లక్షా 20 వేలు. మరో రెండు రోజుల్లో ఆకస్మిక వరదలు సంభవించే ఆస్కారం ఉందని జాతీయ వాతావరణ విభాగం అధికారులు తెలిపారు. ఆ తర్వాత పరిస్థితులు మెరుగు పడొ చ్చనే అంచనాలు ఉన్నాయి. విల్మింగ్టన్లో దాదాపు 400 మందిని వరద నుంచి రక్షించారు. అయితే, పలు ప్రాంతాల్లో దొంగతనాలు జరగుతున్నట్టు ఫిర్యాదులు అందిన నేపథ్యంలో అధికారులు కర్ఫ్యూ విధించారు. విల్మింగ్టన్లోనే తన విద్యాభ్యాసం కొనసాగించిన అమెరికా బాస్కెట్బాల్ దిగ్గజం మైకేల్ జోర్డాన్ వరద బాధితుల సహాయార్థం విరాళాలు సేకరిస్తున్నారు. తుఫాను బలహీనపడి వాయుగుండంగా మారింది. నేషనల్ హరికేన్ సెంటర్ వెల్లడించిన సమాచారం ప్రకారం గంటకు 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఉత్తర కరోలినాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ త్వరలో పర్యటిస్తారని అధ్యక్ష కార్యాలయం వెల్లడించింది.
ఫిలిప్పీన్స్లో విరిగిపడ్డ కొండచరియలు : 65 మంది మృతి
ఫిలిప్పీన్స్లో కొండచరియలు విరిగిపడటంతో 65 మంది మృతి చెందారు. మరికొందరు గల్లంతైనట్టు సమాచారం. ఫిలిప్పీన్స్ గతకొద్ది రోజులగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. మాంగ్కూట్ తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. ఈ తుఫానులో 43 మంది చిక్కుకున్నారని, 64 మంది గాయపడ్డారని ఫిలిప్పీన్స్ నేషనల్ పోలీసులు వెల్లడించారు. వరదల్లో చిక్కుకొన్న వారికోసం ప్రత్యేక గాలింపు చర్యలు చేపట్టామని అన్నారు. కార్డిల్లేరా అడ్మినిస్ట్రేటివ్ రీజియన్లో ఎక్కువ మంది చిక్కుకున్నారని అన్నారు. బంగారు గనుల్లో చిక్కుకొని 40 మంది మృతి చెందినట్టు పోలీస్ అధికారులు ధ్రువీకరించారు. ఫిలిప్పీన్స్ ఉత్తర ప్రాంతంలో గత కొంతకాలంగా అక్రమ మైనింగ్స్ కొనసాగుతున్నాయి. వీటిని తక్షణమే ఆపేయాలని ప్రభుత్వం ఆదేశించింది. సహాయక చర్యల్లో ఫిలిప్పీన్స్ సైన్యం, పోలీసులు చురుగ్గా పాల్గొంటున్నారని పర్యావరణ శాఖ కార్యదర్శి రారు సిమాటు తెలిపారు.