Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కూతురు, అల్లుడిని కూడా విడుదల చేయాలంటూ ఆదేశాలు
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్కు ఇస్లామాబాద్ హైకోర్టులో ఊరట లభించింది. అవినీతి నిరోధక కేసులను విచారించే నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో (ఎన్ఏబీ) కోర్టు విధించిన జైలుశిక్షను రద్దు చేస్తూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఆయనతో పాటు కుమార్తె మరియంను, అల్లుడు కెప్టెన్ సఫ్దర్ను కూడా జైలు నుంచి విడుదల చేయాలని ఆదేశించింది. షరీఫ్ కుటుంబానికి వ్యతిరేకంగా ఆధారాలు చూపడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని జస్టిస్ అథర్ మినల్లా, జస్టిస్ మియంగుల్ హసన్ ఔరంగజేబులతో కూడిన ద్విసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఎన్ఏబీ కోర్టు విధించిన జైలుశిక్ష రద్దు చేస్తున్నట్టు తీర్పు వెలువరించింది.
నవాజ్ కుటుంబీకులు అవినీతి సొమ్ముతో లండన్లో నివాసాలను కొనుగోలు చేశారనేందుకు ఎలాంటి రుజువులు లేవని గుర్తించింది. అయితే, ఈ ముగ్గురూ పాకిస్తాన్ కరెన్సీలో 5లక్షల చొప్పున మొత్తం 15 లక్షల పూచీకత్తు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. కాగా, ఈ ఏడాది జులై 6న అవినీతి కేసులో ఎన్ఏబీ కోర్టు వీరికి శిక్ష విధించిన విషయం తెలిసిందే. తమకు విధించిన శిక్షను రద్దు చేయాలంటూ అభ్యర్థిస్తూ ఇస్లామాబాద్ హైకోర్టులో అప్పీల్ చేసుకున్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ద్విసభ్య ధర్మాసనం తీర్పును ఇటీవల రిజర్వ్లో ఉంచింది. అనంతరం బుధవారం వారి శిక్షను సస్పెండ్ చేసినట్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో, వీరు విడుదలయ్యే అవకాశముంది. కాగా, ఎన్ఏబీ కోర్టు నవాజ్ షరీఫ్కు పదేండ్ల జైలు శిక్ష, 10.5మిలియన్ డాలర్ల జరిమానా విధించింది. ఆయన కూతురు మరియంకు ఏడేండ్ల జైలు శిక్ష, 2.6మిలియన్ డాలర్లు విధించిన విషయం తెలిసిందే.
అవినీతి కేసులో నవాజ్ షరీఫ్, ఆయన కూతురు మరియంను కోర్టు దోషులుగా తేల్చింది. అవెన్ఫీల్డ్ ప్రాపర్టీస్ కేసులో ఈ శిక్ష పడింది. నవాజ్ షరీఫ్ అల్లుడు రిటైర్డ్ కెప్టెన్ సఫ్దర్కు ఏడాది జైలు శిక్ష విధించారు. ఇటీవల జరిగిన ఎన్నికలకు ముందు ఈ తీర్పు వెలువడింది. షరీఫ్పైన మొత్తం నాలుగు అవినీతి కేసులు ఉన్నాయి. గత వారం, లండన్లో కాన్సర్తో చనిపోయిన షరీఫ్ భార్య, కుల్సోంకు అంత్యక్రియల నిమిత్తం నవాజ్ షరీఫ్, ఆయన కుమార్తె 5 రోజుల పెరోల్ మీద విడుదలయ్యారు. తాజా తీర్పుతో వీరిద్దరితోపాటు నవాజ్ షరీఫ్ అల్లుడు కెప్టెన్ సఫ్దార్ విడుదల కానున్నారు.
నవాజ్ షరీఫ్ విడుదల కానున్న సమాచారంతో ఆయన అభిమానుల పెద్ద ఎత్తున ఇస్లామాబాద్లో సంబరాలు జరుపుకున్నారు. మిఠాయిలు పంచుకున్నారు. నవాజ్కు మద్దతుగా నినాదాలు చేశారు.