Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఊపందుకుంటున్న డిమాండ్
లండన్: వచ్చే మార్చి నాటికి ఐరోపా కూటమి నుండి నిష్క్రమించేందుకు సిద్ధమవుతున్న బ్రిటన్లో ఈ అంశంపై మరోసారి ప్రజాభిప్రాయాన్ని కోరాలన్న (రిఫరెండం) డిమాండ్ నానాటికీ ఊపందుకుంటోంది. బ్రిటన్లోని థెరెస్సా మే ప్రభుత్వం బ్రెగ్జిట్పై జరుపుతున్న చర్చల్లో ప్రతిపాదిస్తున్న ఆరు అంశాలకు సంబంధించి సాధ్యమైతే మరోసారి ప్రజాభిప్రాయాన్ని కోరాలని బ్రెగ్జిట్ వ్యతిరేకులు, ఐరోపా కూటమి మద్దతుదారులు ప్రచారం ఉధృతం చేస్తున్నారు. బ్రెగ్జిట్పై తొలిసారిగా 2016 రిఫరెండం జరిగి రెండేళ్లు గడిచిపోయిన తరువాత బ్రిటన్లో రాజకీయ, ఆర్థిక, రాజ్యాంగ సంక్షోభ పరిస్థితులు ముదురుతున్నాయని, ఈ నేపథ్యంలో బ్రెగ్జిట్పై మరోసారి ప్రజాభిప్రాయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం వుందని ఐరోపా కూటమిలో గతంలో బ్రిటన్ రాయబారిగా వ్యవహరించిన సివిల్స్ మాజీ అధికారి లార్డ్ కెర్ స్పష్టం చేస్తున్నారు.
ఈ అంశంపైన వివిధ రాజ్యాంగ, న్యాయనిపుణులతో చేసిన సంప్రదింపులు, వారి నుండి సేకరించిన సలహాలు సూచనలతో రూపొందించిన నివేదికను ఆయన బుధవారం ఇక్కడ ఆవిష్కరించారు. బ్రెగ్జిట్పై గతంలో వ్యక్తమైన ప్రజాభిప్రాయంలో మార్పు వచ్చే అవకాశం లేకపోలేదు. ఇప్పటికీ సమయం మించిపోలేదు. బ్రిటన్ నిష్క్రమణకు ఇంకా సమయం వుంది. అప్పటి వరకూ ఆర్టికల్ 50ని ఉపసంహరించుకోవాల్సిన అవసరం వుందని ఆయన స్పష్టం చేశారు. గత ఏడాది అమలులోకి వచ్చిన ఆర్టికల్ 50 ప్రకారం బ్రిటన్ ఐరోపా కూటమి నుండి నిష్క్రమించటానికి రెండేళ్ల గడువు అమలులోకి వచ్చింది. ఈ గడువు వచ్చేఏడాది మార్చి 29తో ముగియనున్న విషయం తెలిసిందే.
పార్లమెంట్ ఓటు
తాజాగా యుగవ్ అనే సంస్థ గత జులైలో నిర్వహించిన ఒపీనియన్ పోల్లో మరో రిఫరెండంపై 42 శాతం మంది సానుకూలత వ్యక్తం చేయగా, 40 శాతం మంది వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న చర్చల అనంతరం ఐరోపా కూటమితో జరుగుతున్న చర్చల్లో కుదిరిన ఒప్పందానికి ఈ ఏడాది చివరిలో పార్లమెంట్ ఆమోదముద్ర వేయాల్సి వుంది.
ఆ సమయంలో పార్లమెంట్ దిగువ సభ (హౌస్ ఆఫ్ కామన్స్)లో ఒక తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదం పొందటంతో పాటు బ్రెగ్జిట్ చట్టానికి కొన్ని సవరణలు చేస్తే మరో రిఫరెండంకు సానుకూల పరిస్థితులు ఏర్పడతాయని బ్రెగ్జిట్ వ్యతిరేక 'పీపుల్స్ ఓట్' ప్రచారకర్తలు చెబుతున్నారు.
ఒక వేళ బ్రెగ్జిట్ ఒప్పందాన్ని ఎంపిలు వ్యతిరేకించినా, వచ్చే ఏడాది జనవరి 21లోగా తుది ఒప్పందం కుదరకపోయినా ప్రభుత్వం తన ఆలోచనా విధానాన్ని ప్రకటించాల్సి వుంటుందని, అప్పుడు పార్లమెంట్ తన ఓటింగ్ ద్వారా అభిప్రాయాన్ని చెబుతుందని వారు వివరిస్తున్నారు.
దీని ద్వారా కూడా మరోసారి రిఫరెండం నిర్వహణకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయంటున్నారు. మలి రిఫరెండంపై అభిప్రాయాన్ని మార్చుకోవాలంటూ ఇప్పుడు వెలుగు చూసిన తాజా నివేదిక లేబర్ పార్టీపై వత్తిడి పెంచుతుందని, దీనితో ప్రస్తుత పాలక కన్జర్వేటివ్లతో పాటు స్కాటిష్ నేషనల్ పార్టీ, లిబరల్ డెమొక్రాట్స్ రెండో రిఫరెండంను సమర్థిస్తుండగా లేబర్ పార్టీకి కూడా ఇది అనివార్యమవుతుందని ఈ నివేదిక రూపకర్త లార్డ్ కెర్ అభిప్రాయపడుతున్నారు.
రాజకీయ నేతలతో పాటు అనేక వ్యాపార, కార్మిక, వాణిజ్య సంఘాలు, ఇతర గ్రూప్లు కూడా మలి రిఫరెండంను కోరుతున్న పీపుల్స్ ఓట్ను సమర్థిస్తున్నారు. మలి రిఫరెండంను సమర్థించకపోతే పార్టీ నాయకత్వ బాధ్యతల నుండి తప్పుకోవాలంటూ లేబర్ పార్టీ నేత జెరిమి కార్బిన్ను లిబ్డెమ్ నేత విన్సెంట్ కేబుల్ డిమాండ్ చేశారు.