Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడో వంతు హింస రగులుతున్న దేశాలవారే
ఐక్యరాజ్యసమితి: ప్రపంచంలోని ఐదు నుంచి 17 ఏండ్ల వయసు చిన్నారుల్లో 30 కోట్లమంది బడి బయటనే ఉన్నట్టు ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి(యూనిసెఫ్) తాజా నివేదిక వెల్లడించింది. వీరిలో మూడో వంతు దాదాపు 10 కోట్ల 40 లక్షలమంది వైషమ్యాలు(హింస),విపత్తులతో బాధపడుతున్న దేశాలకు చెందినవారేనని నివేదిక పేర్కొన్నది. వీరిలోని 15-17 ఏండ్ల వయసువారిలో ఐదుగురిలో ఒకరు పాఠశాల ముఖమే చూడనివారు కాగా, ఐదుగురిలో ఇద్దరు ప్రాథమిక పాఠశాల పూర్తి చేయనివారు. 'ఏ ఫ్యూచర్ స్టోలెన్: యంగ్ అండ్ అవుటాఫ్ స్కూల్ ' పేరుతో యూనిసెఫ్ తన నివేదికను ప్రకటించింది. ఒక దేశం వైషమ్యాలు లేదా విపత్తుల్లో చిక్కుకుంటే చిన్నారులు, యుక్త వయసు పిల్లలు రెండింతల బాధితులవుతారని యూనిసెఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హెన్రియెట్టా ఫోర్ అన్నారు. సాయుధ దళాలు పాఠశాలలను ఆక్రమించడం లేదా ధ్వంసం చేయడం వల్ల చిన్నారులు విద్యకు దూరమవుతున్నారని ఆమె తెలిపారు. హింసాత్మక ఘటనలు దీర్ఘకాలంపాటు సాగితే ఆ దేశాల్లో దారిద్య్రం తాండవిస్తుందని ఆమె అన్నారు. ప్రపంచంలో 10-19 ఏండ్ల వయసువారి జనాభా 2030కల్లా 130 కోట్లకు చేరుతుందని యూనిసెఫ్ అంచనా వేసింది. ఆ వయసువారి ప్రస్తుత జనాభాకు అది 8 శాతం అధికమని తెలిపింది.