Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్యాంకింగ్ వ్యవస్థలోకి 10,900 కోట్ల డాలర్ల విడుదల
బీజింగ్: తమ అవసర నిల్వల నిష్పత్తి(ఆర్ఆర్ఆర్)కి ఒక్క శాతంమేర కోత విధిస్తున్నట్టు చైనా కేంద్రీయ బ్యాంక్(పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా-పీబీవోసీ) తెలిపింది. అమెరికాతో వాణిజ్య యుద్ధం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నది. దీంతో, ఈ నెల 15నుంచి తమ బ్యాంకింగ్ వ్యవస్థలోకి 10,900 కోట్ల డాలర్ల నగదు విడుదల కానున్నట్టు చైనా సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. దీని వల్ల చైనా బ్యాంకులు అదనంగా లక్షా 20 వేల కోట్ల యువాన్లమేర అప్పులిచ్చేందుకు వీలుంటుందని తెలిపింది. చైనా వ్యాపార సంస్థలకు మూలధన పెట్టుబడులకు లోటు లేకుండా పీబీవోసీ ఈ నిర్ణయం తీసుకున్నది.
ఇటీవల చైనా నుంచి దిగుమతయ్యే వస్తువులపై అమెరికా భారీగా సుంకాలను విధించిన విషయం తెలిసిందే. ప్రపంచీకరణలో భాగంగా చైనా ఉత్పత్తులకు యూరోపియన్ యూనియన్ తర్వాత అమెరికా అతిపెద్ద మార్కెట్గా మారింది. అమెరికా తర్వాత అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చైనా ఆవిర్భవించింది. ఈ ఏడాది జూన్లో చైనా ఉత్పత్తులపై ట్రంప్ సర్కార్ సుంకాలను భారీగా పెంచడంతో ఈ రెండు దేశాల మధ్య వాణిజ్య యుద్ధానికి తెరలేచింది. ఒకరి ఉత్పత్తులపై ఒకరు సుంకాలు పెంచుకుంటూ వాణిజ్య యుద్ధాన్ని కొనసాగిస్తున్నారు.
ఆంక్షలకు ముందు అమెరికా మార్కెట్లను చైనా ఉత్పత్తులు ముంచెత్తాయి. 2017లో ఇరు దేశాల ద్వైపాక్షిక వాణిజ్యం విలువ 63,500 కోట్ల డాలర్లు. కాగా, ఇందులో అమెరికాకు చైనా ఎగుమతుల విలువ 50,500 కోట్ల డాలర్లు. చైనాకు అమెరికా ఎగుమతుల విలువ 12,900 కోట్ల డాలర్లు. అంటే.. చైనాతో వాణిజ్యపరంగా అమెరికాకు లోటు 37,500 కోట్ల డాలర్లు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కడుపు మంటకు కారణం ఇదే. ఈ రెండు అగ్ర రాజ్యాల మధ్య వాణిజ్య యుద్ధం పట్ల పలువురు ఆర్థికవేత్తలు అసహనం వ్యక్తం చేశారు. దాంతో, చైనాతో సంప్రదింపులకు అమెరికా అంగీకరించింది. మొదటి దఫా చర్చల్లో ఎలాంటి సయోధ్యా కుదరకపోవడంతో సోమవారం ఇరు దేశాల మధ్య రెండో దఫా చర్చలు జరగనున్నాయి. చైనాతో చర్చలకు అమెరికా తరఫున ఆ దేశ విదేశాంగమంత్రి మైక్ పాంపియో నేతృత్వం వహిస్తున్నారు.