Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
బ్యాంకాక్: థాయ్లాండ్లో ఓ భారతీయ పర్యాటకుడు దారుణ హత్యకు గురయ్యాడు. రెండు వర్గాల మధ్య జరిగిన ఎదురుకాల్పుల కారణంగా అతను మృతి చెందాడు. ఈ ఘటన పట్ల థాయ్లాండ్ ప్రభుత్వం విచారణ వ్యక్తం చేసింది. కేసు నమోదు చేసుకొని నిందితుల కోసం గాలిస్తున్నట్టు వెల్లడించింది. వివరాల్లోకి వెళ్లితే... గాఖ్రెజర్ ధీరజ్ (42) అనే ఓ భారతీయ పర్యాటకుడు థాయ్లాండ్లో పర్యటించాడు. ఈ ప్రాంతంలోని రెండు గ్యాంగ్ల మధ్య హోరాహోరీగా కాల్పులు చోటుచేసుకున్నాయి. ఇదే సమయంలో ఘటనాస్థలంలో ఉన్న ధీరజ్కు బుల్లెట్లు తగిలాయి. హుటాహుటిన ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. మరో ఇద్దరు భారతీయులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వీరిద్దరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రత్చథేవీలోని సెంటారా వాటర్గేట్ పవిల్లియన్ హోటల్ సమీపంలో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో భారతీయులతో పాటు లావోస్కు చెందిన కియోవోంగ్సా థోనెకియో (28) అనే పర్యాటకుడు కూడా మృతి చెందాడని పోలీసులు చెప్పారు. మరో ఇద్దరు థాయికి చెందిన వ్యక్తు లు, లావోస్కు చెందిన ఓ పర్యాటకుడికి తీవ్ర గాయాలయ్యాయని వివ రించారు. నిన్న రాత్రి హోటల్లో భోజనం చేసిన భారత పర్యాటకులు తమ బస్సు కోసం ఎదురుచూస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పారు. అక్కడి స్నూకర్ క్లబ్ నుంచి బయటకు వచ్చిన రెండు గ్యాంగులు పరస్పరం తుపాకులతో కాల్పులు జరుపుకోవడంతో ఆ బుల్లెట్లు పలువురు పర్యాటకులకు తగిలాయని స్థానిక పోలీస్ మేజర్ జనరల్ సమరర్న్ సమ్రుయాజ్కిత్ మీడియాకు తెలిపారు. స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం... 20 మందితో కూడిన రెండు గ్యాంగులు తుపాకులు, కత్తులు, కర్రలతో క్లబ్ లోంచి బయటకు దూసుకొచ్చి వీధిలో పరస్పరం ఘర్షణకు దిగాయి. పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకునే లోపు అందరూ అక్కడి నుంచి పరారయ్యారు.