Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సౌదీలో జరగనున్న పెట్టుబడుల సదస్సు నుంచి తప్పుకున్నట్టు వెల్లడి
లండన్: జర్నలిస్టు జమాల్ ఖషోగ్గీ అదృశ్యం నేపథ్యంలో సౌదీ అరేబియాకు బ్రిటన్, అమెరికా దేశాలు షాకిచ్చాయి. త్వరలో సౌదీలో జరగనున్న పెట్టుబడుల సదస్సు నుంచి యుఎస్ ట్రెజరీ సెక్రటరీ స్టీవెన్ మున్చిన్, బ్రిటన్ అంతర్జాతీయ వాణిజ్య కార్యదర్శి లియామ్ ఫాక్స్ వైదొలగారు. ఇప్పటికే డచ్, ఫ్రాన్స్ మంత్రులు, పలు దేశాలకు చెందిన రాజకీయ నాయకులు ఈ కార్యక్రమం నుంచి వైదొలగారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సౌదీ అధినేతలతో చర్చలు జరిపాకే ఈ నిర్ణయం వెలువ డటం విశేషం. ఇటీవలే అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పాంపియో కూడా ఇటీవలే సౌదీని సందర్శించి రాజు సల్మాన్తో భేటీ అయ్యారు. మరోపక్క గోల్డ్ మన్ సాక్స్, పెప్సీ, ఈడీఎఫ్లు కూడా ఈ సదస్సు నుంచి తప్పుకోనున్నట్టు వార్తలు వెలువడ్డాయి. ఈనెల 2న ఇస్తాంబుల్లోని సౌదీ రాయబార కార్యాలయానికి వెళ్లిన జమాల్ ఖషోగ్గీ అనే జర్నలిస్ట్ అదృశ్యమయ్యారు.
ఆ తర్వాత అతని ఆచూకీ ఇప్పటి వరకు తెలియలేదు. సౌదీ అధికారులే అతన్ని హత్య చేసి ఉంటారని టర్కీ దర్యాప్తు బృందాలు అనుమానిస్తున్నాయి. సీసీటీవీ ఫుటేజ్లోనూ ఖషోగ్గీ లోనికి వెళ్లిన దృశ్యాలు ఉన్నాయి. కానీ, అతను బయటకు వస్తున్న దృశ్యాలు కనిపించడంలేదు. ఖషోగ్గీ బయటకు వెళ్లిన దృశ్యాలను తమకు చూపాలని టర్కీ డిమాండ్ చేస్తున్నది.