Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాలుగు యూఎస్ పబ్లిక్ ఫండ్స్ కంపెనీల ప్రతిపాదన
వాషింగ్టన్ : ఫేస్బుక్ సీఈవో, చైర్మెన్ మార్క్ జుకర్బర్గ్ను ఆ పదవి నుంచి తొలగించాలని అమెరికాకు చెందిన నాలుగు దిగ్గజ పబ్లిక్ ఫండ్స్ కంపెనీలు ప్రతిపాదిస్తున్నాయి. ఫేస్బుక్ వినియోగదారుల డాటా హ్యాకింగ్కు గురవుతున్నప్పటికీ జుకర్బర్గ్ ఎలాంటి చర్యలు చేపట్టలేకపోయారని ఆయా కంపెనీలు ఆరోపించాయి. కేంబ్రిడ్జ్ ఎనలిటికల్ డాటాతో పాటు 3కోట్ల మంది వినియోగదారుల వ్యక్తిగత సమాచారం లీకైనప్పటికీ ఫేస్బుక్ ఎలాంటి చర్యలు చేపట్టలేదని వాపోయాయి. తద్వార సోషల్ మీడియా దిగ్గజ చైర్మెన్గా జుకర్బర్గ్ను తొలగించాలని ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఫేస్బుక్ ఇంక్లో మెజార్టీ షేర్లను కలిగి ఉన్న నాలుగు దిగ్గజ అమెరికా పబ్లిక్ ఫండ్స్ జుకర్బర్గ్ను చైర్మెన్గా తొలగించాలనే ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చాయి. కంపెనీలో అతిపెద్ద అసెట్ మేనేజర్లు కూడా ఈ ప్రతిపాదనకే మొగ్గు చూపుతారని అవి అవి ఆశిస్తున్నారు. ఈ ప్రతిపాదన దాఖలు చేసిన వాటిలో ఇల్లినోయిస్, రోడ్ఐలాండ్, పెన్సిల్వేనియాలకు చెందిన స్టేట్ ట్రెజర్స్, న్యూయార్క్ సిటీ కంప్ట్రోలర్ స్కాట్ స్ట్రింగర్ ఉన్నాయి. ఇలాంటి ప్రతిపాదనే ఫేస్బుక్లో 2017లో ఒకసారి వచ్చింది. అయితే, తాజాగా తీసుకొచ్చిన ప్రతిపాదన ఎంతో కీలకమైనదని రోడ్ ఐలండ్ స్టేట్ ట్రెజర్స్ వెల్లడించింది. డాటా హ్యాక్, కేంబ్రిడ్జ్ అనలిటికా స్కాండల్ వంటి సమస్యల నుంచి ఫేస్బుక్ను బయటపడేయడానికి ఇదే మార్గమని పేర్కొంది. వార్షిక సమావేశంలో ఎలాగైనా ఈ ప్రతిపాదనన చర్చించేలా చేస్తామని రోడ్ ఐలాండ్ స్టేట్ ట్రెజర్ సేథ్ మాగజైనర్ చెప్పారు. ఈ విషయంపై స్పందించడానికి ఫేస్బుక్ అధికార ప్రతినిధి నిరాకరించారు. కంపెనీ వార్షిక సమావేశం 2019 మేలో జరగనుంది. స్వతంత్ర బోర్డ్ చైర్ను నియమించాలని బోర్డును కోరతామని తెలిపారు.
ఫేస్బుక్లో ప్రస్తుతం నడుస్తున్న ఈ లుకలుకలు ప్రపంచంలోనే అతిపెద్ద సోషల్ మీడియా నెట్వర్క్గా పేరున్న ఈ కంపెనీ ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నాయి. ఫేస్బుక్ షేర్లు 10 శాతం కిందకి పడిపోయాయి. కాగా, పెన్సిల్వేనియా ట్రెజరీ 38,737 షేర్లను, ఇల్లినోయిస్ ట్రెజరీ 1,90,712 షేర్లు, రోడ్ ఐలాండ్ ట్రెజరీ 1,68,230 షేర్లను కలిగి ఉంది. అయితే జుకర్బర్గ్ 60శాతం ఓటింగ్ హక్కులు ఉండటంతో, ఈ ప్రతిపాదన ఈ సారైనా ఆమోదం అవుతుందో లేదో చూడాల్సి ఉంది.