Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-13 మంది మృతి, 12 మంది చిన్నారుల అపహరణ
కిన్షసా : కాంగోలో తిరుగుబా టుదారులు బీభత్సం సృష్టించారు. వీరు జరిపిన మెరుపుదాడిలో 13 మంది మృతి చెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. అనంతరం తిరుగుబాటుదారులు 12 మంది చిన్నారులను అపహరించుకొని వెళ్లారు. ఎబోలా వ్యాధి విజృభించిన డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ( డీఆర్సీ ) ఈ ఘటనల చోటుచేసుకుంది. అలైడ్ డెమోక్రటిక్ ఫోర్సెస్ తిరుగుబాటుదారులే ఈ ఘాతుకానికి ఒడిగట్టారని పోలీస్ అధికారులు అనుమానిస్తున్నారు. సైనిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం...బెంగీలోని కాంగోలిస్ ఆర్మీ క్వార్టర్స్పై ఆదివారం తిరుగుబాటుదారులు మెరుపుదాడికి పాల్పడ్డారు. తిరుగుబాటుదారులు జరిపిన కాల్పుల్లో 13 మంది చనిపోయారు. కాగా, గతేడాది కివూ ఉత్తర ప్రాంతంలోనూ తిరుగుబాటుదారులు బీభత్సం సృష్టించారు. వీరి దాడుల్లో 34 మంది మృతి చెందగా, 215 మంది అపహరణకు గురయ్యారు. డీఆర్సీలో గతనెలలో ఎబోలా వ్యాధి విజృభించడంతో ఇక్కడి ప్రజలు అనేక ఇబ్బందులుపడుతున్నారు. ఈ ప్రాంత ప్రజలను లక్ష్యంగా చేసుకొని తిరుగుబాటుదారులు మెరుపుదాడికి పాల్పడి హతమార్చడం అమానవీయ ఘటన అని కాంగో ఆరోగ్య శాఖ మంత్రి కార్యాలయం పేర్కొంది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసింది.