Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రయివేటీకరణ విధానాలపై ఐరాస
న్యూయార్క్: ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలో కొనసాగుతున్న ప్రయివేటీకరణ విధానాలతో పేదలు, బడుగులకు తీరని అన్యాయం జరుగుతోందని ఐరాస తాజా నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నివేదిక ఈ నెల 19న ఐరాస జనరల్ అసెంబ్లీ ముందుకొచ్చింది. పేదల ప్రయోజనాలను, మానవ హక్కులపై పడే దుష్ప్రభావాన్ని ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోకుండా ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్)తో పాటు ఐరాస కూడా ప్రజలకు అవసరమైన ప్రాథమిక సేవలను ప్రయివేటీకరిస్తోందని పేదరిక నిర్మూలన, మానవ హక్కుల పరిరక్షణకు సంబంధించిన ఐరాస ప్రత్యేక ప్రతినిధి ఫిలిప్ ఆల్స్టన్ ఈ నివేదికలో విమర్శించారు. ప్రయివేటీకరణతో వచ్చే నష్టాల గురించి మానవ హక్కుల సంఘాలు గట్టిగా ప్రతిస్పందించలేకపోతున్నాయని ఆయన ఈ నివేదికలో పేర్కొన్నారు. న్యాయం, సామాజిక భద్రత, జైళ్లు, విద్య, ప్రాథమిక ఆరోగ్య పరిరక్షణ, ఇతర ముఖ్యమైన పౌర సేవలను ప్రయివేటీకరించటం తగదని ఆయన హితవు పలికారు. ప్రజలకు చేటు చేస్తుందన్న విషయం తెలిసి కూడా ప్రభుత్వాలు తాము ప్రజలకు అందించాల్సిన మౌలిక సేవల నుంచి తప్పుకుని, వాటిని ప్రయివేటు రంగానికి అప్పగిస్తున్నాయని అన్నారు.. డబ్బు ఆదా అవుతుందని, సామర్ధ్యం పెరుగుతుందని, సేవలు మెరుగుపడతాయని ప్రయి వేటీకరణ సమర్థకులు చేస్తున్న వాదనల్లో ఏమాత్రం పస లేదని ఆల్స్టన్ పేర్కొన్నారు. ప్రభుత్వాలు ఇటీవలి కాలంలో చేపడుతున్న పూర్తి ప్రయివేటీకరణ లేదా ప్రభుత్వ-ప్రయివేటు భాగస్వామ్య విధానం వంటివి పేద, బడుగు వర్గాలకు పిడుగు పాటులా పరిణమించిందని చెప్పారు. ప్రయివేటీకరించిన తరువాత సేవల్లో నాణ్యత లోపిస్తోందని పలు అధ్యయనాల్లో తేలిందని ఆయన తెలిపారు.. బ్రిటన్లో ప్రభుత్వ ఆర్థిక లావాదేవీల ఆడిటింగ్ ప్రక్రియను ప్రయివేటీకరించటం, ఫ్రాన్స్, గ్రీస్, ఐర్లండ్, స్పెయిన్ తదితర దేశాలలో రోడ్డు రవాణా, సమాచార, కమ్యూనికేషన్స్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రభు త్వ-ప్రయివేటు భాగస్వామ్య విధానంలో నిర్వహిం చటం వంటి అంశాలను అధ్యయనం చేసినపుడు ఈ విధా నాలలో అనేక లొసుగులతో పాటు పరిమిత స్థాయిలో మాత్రమే ప్రయోజనాలు కన్పించాయని ఆయన వివరించారు.
ప్రయివేటీకరణ లాభాల కోసమే తప్ప సమానత్వం కోసం కాదు
మానవ హక్కుల పరిరక్షణ, ఆత్మ గౌరవం, సమానత్వం వంటి భావాలకు భిన్నంగా ప్రయివేటీకరణ ప్రక్రియ కొనసాగుతోందని ఆల్స్టమ్ తన నివేదికలో పేర్కొన్నారు. ప్రయివేటీకరణ ప్రక్రియలో లాభార్జనే ధ్యేయంగా వుంటోంది తప్ప సమానత్వం, వివక్ష లేని సేవలు వంటివి కనుమరుగైపోతున్నాయని ఈ నివేదిక తెలిపింది. హక్కుదారులందరూ క్లయింట్లుగా మారిపోతున్నారని, పేద, అవసరార్ధులైన బడుగు, బలహీన వర్గాలకు సేవలు దూరమవుతున్నాయని తెలిపింది. మానవ హక్కుల పరిరక్షణ అంశానికి ప్రయివేటీకరణ ఒప్పందాలలో చోటేలేదని ఈ నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వాలు చేపడుతున్న ప్రయివేటీకరణ ప్రక్రియకు హద్దూ, అదుపూ లేకుండా పోతోందని ఆల్స్టమ్ విమర్శించారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రభుత్వ సంస్థలు, సేవలను ప్రయివేటు సంస్థలు చేపడుతున్నాయని, లాభార్జనే పరమావధిగా వాటిని నిర్వహిస్తున్నాయని ఆయన తెలిపారు. ఇప్పటి వరకూ ప్రజలపైకి దూసుకొస్తున్న ఈ ప్రయివేటీకరణ అలలు పేద, బడుగులకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయన్నారు.. ప్రయివేటీకరణను సవాలు చేసే సమయంలో మానవ హక్కుల సంస్థలు ఇప్పటికైనా కళ్లు తెరచి, సమానత్వం, సమాజం, ప్రజా ప్రయోజనాలు, సమిష్టి బాధ్యతల వంటి కీలక అంశాలపై దృష్టిసారించాలని ఆయన కోరారు.