Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏడు లక్షల మంది పాల్గొన్నట్టు నిర్వాహకుల వెల్లడి
లండన్: బ్రెగ్జిట్ తుది ఒప్పందానికి వ్యతిరేకంగా లండన్లో భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ ప్రదర్శనలో 7లక్షల మందికి పైగా నిరసనకారులు పాల్గొన్నట్టు ర్యాలీ నిర్వాహకులు, యూకేఐపీ మాజీ నేత నైగెల్ ఫరేగ్ వెల్లడించారు. ఈ నిరసన కార్యక్రమాలకు పలువురు ఎంపీలు సంఘీభావం తెలిపారు. లండన్లోని పార్లమెంట్ స్క్వేర్ వరకు నిరసనకారులు భారీ ర్యాలీ తీశారు. నిరసన ప్రదర్శనను ఉద్దేశించి లండన్ మేయర్ సాదిఖ్ ఖాన్, స్టీవ్ కూగన్, డేలియా స్మిత్, డెబోరా మెడెన్ మాట్లాడారు. నిరసనకారులు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. ప్లకార్డులు, బ్యానర్లు చేబూని నిరసనప్రదర్శన చేపట్టారు. ఐరోపా సమాఖ్య(ఈయూ)తో తెగతెంపులు చేసుకొనేందుకు అనుసరించే విధానాలపై బ్రిటన్ సర్కారు ఈ ఒప్పందాన్ని సిద్ధంచేసింది. అయితే దీనిపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. 'మార్చ్ ఫర్ ద ఫ్యూచర్'' పేరుతో పార్లమెంటు స్క్వేర్కు వారుతీసిన ర్యాలీతో లండన్లో పలు ప్రాంతాలు కిక్కిరిశాయి. 2003లో ఇరాక్ యుద్ధానికి వ్యతిరేకంగా ఇక్కడ దాదాపు 7.5 లక్షల మంది నిరసన చేపట్టారు. అనంతరం జరిగిన భారీ ప్రదర్శన ఇదేనని పోలీసులు చెబుతున్నారు. అయితే, బ్రెగ్జిట్ అంశంపై మరో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలన్న నిరసనకారుల డిమాండ్ను ప్రధాని థెరిసా మే అంగీకరించడం లేదు. ఈయూలో కొనసాగాలా ? వద్దా ? అనే అంశంపై బ్రిటన్లో 2016, జూన్లో ప్రజాభిప్రాయ సేకరణ జరిగిన సంగతి తెలిసిందే. ఈయూతో తెగతెంపులు చేసుకోవడమే మేలని 51.89శాతం మంది ఓటు నమోదు చేయగా, బ్రిటన్ను ఈయూలోనే కొనసాగించాలని 48.11శాతం మంది ఓట్లు నమోదు చేశారు. తద్వారా, ఈయూ నుంచి బ్రిటన్ విడిపోయింది. ఆర్టికల్ 50 ప్రకారం...ఈయూ నుంచి బ్రిటన్ పూర్తిగా వైదొలిగేందుకు 2019, మార్చి29 డెడ్లైన్గా నిర్ణయించారు.