Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నలుగురు మృతి, 15 మందికి గాయాలు
బాగ్దాద్ : ఇరాక్లోని మోసుల్ నగరంలో కారు బాంబు పేలింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, మరో 15 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం....మోసుల్లోని ఖయ్యార ప్రాంతంలో ఓ రెస్టారెంట్ ముందు మంగళవారం భారీ పేలుడు సంభవించింది. పేలుడు శబ్దం వినగానే ప్రజలు ప్రాణభయంతో వీధుల్లోకి పరుగులు తీశారు. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 15 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న ప్రత్యేక బలగాలు, బాంబు స్క్వాడ్ ఘటనాస్థలికి చేరుకున్నారు. రెస్టారెంట్ ముందు నిలిపివున్న ఓ వాహనంలో పేలుడు పదార్థాలు ఉండటంతోనే ఈ పేలుడు సంభవించిందని బాంబ్ స్వ్వాడ్ నిర్ధారించింది. ఈ ప్రాంతంలో ముమ్మర తనిఖీలు చేపట్టాయి. అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నాయి. కాగా, ఈ ఘటనకు పాల్పడినట్టు ఏ ఉగ్రసంస్థ కూడా ప్రకటించుకోలేదు. అయితే, ఇరాక్లో ఐఎస్ కార్యకలాపాలు చురుకుగా కొనసాగుతున్నాయి. ఐఎస్ గ్రూప్కు చెందిన సభ్యులే ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారని పోలీస్ అధికారులు అనుమానిస్తున్నారు.