Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వారిపై పోలీసుల్లో అదోరకం అభిప్రాయం:అంతర్జాతీయ హక్కుల సంస్థల అధ్యయనం
న్యూఢిల్లీ : భారతదేశంలో ముస్లింలనగానే పోలీసులు, భద్రతా బలగాలు తీవ్రవాద భావనతో చూస్తున్నారని, మెజార్టీ ముస్లింలు నివసిస్తున్న ప్రాంతాలు నేరాలకు, తీవ్రవాద కార్యకలాపాలకు నిలయమన్న అభిప్రాయంతో పోలీసులు పనిచేస్తున్నారని ఒక అంతర్జాతీయ అధ్యయనం తేల్చింది. కామన్వెల్త్ హ్యూమన్ రైట్స్ ఇన్షియేటివ్, క్విల్ ఫౌండేషన్ అనే రెండు హక్కుల సంస్థలు భారతదేశంలో ముస్లింల పరిస్థితిపై అధ్యయనం చేసింది. 'ముస్లిం వాయిస్ : పర్సెప్షన్ ఆఫ్ పోలిసింగ్ ఇన్ ఇండియా'అనే పేరుతో తాజాగా నివేదిక విడుదల చేసింది. ఇందులోని మరికొన్ని విషయాలు ఇలా ఉన్నాయి...
అహ్మదాబాద్, రాంచీ, ఢిల్లీ, లక్నో, బెంగుళూర్, గౌహతీ, కోజీకోడ్, ముంబయి నగరాల్లోని 197మంది ముస్లింల నుంచి, 25మంది ముస్లిం పోలీస్ అధికారుల నుంచి సమాచారాన్ని సేకరించి ఈ నివేదికను తయారుచేశారు. నగరంలో ఏదైనా నేరంగానీ, తీవ్రవాద చర్యగానీ జరిగితే ఈ ఘటనల్లో ముస్లింలపైనే పోలీసుల అనుమానపు చూపు పడుతోంది. అనేకమంది ముస్లిం యువకుల్ని కేసుల్లో ఇరికిస్తున్నారు. అంతేగాక నేరాలకు, ఘోరాలకు ముస్లిం నివాస ప్రాంతాలు కేంద్రాలుగా ఉంటాయన్న తప్పుడు అభిప్రాయంతో పోలీసులు పనిచేస్తున్నారు.
ముస్లింలు ఎక్కువగా నివసిస్తున్న ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో భద్రతా బలగాల్ని మోహరిస్తున్నారు. ముస్లిం యువతి ఏదైనా ఉద్యోగాన్ని వెతుక్కోవాలన్నా, ఉపాధి పొందాలన్నా మతం కోణంలో వారిని చూస్తున్నారని తెలిసింది.