Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాలుగోవారంతమూ రోడ్లమీదకొచ్చిన ప్రజలు
- టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు
పారిస్ : వరుసగా నాలుగో వారంతం కూడా ఫ్రాన్స్లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు మిన్నంటాయి. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో శనివారం జరిగిన పచ్చకోటు (ఎల్లో వెస్ట్) ఉద్యమంలో లక్షలాది మంది పాల్గొన్నారు. దీంతో భద్రతదళాలకు ఉద్యమకారుల కు మధ్య స్వల్పఘర్షణలు చోటు చేసుకొంటున్నాయి. ఆందోళనకారులపై టియర్గ్యాస్ను ప్రయోగించారు. ముందు జాగ్రత్త చర్యగా ప్రముఖ పర్యాటక ప్రదేశమైన ఈఫిల్ టవర్ను మూసివేయాలని అధికారులు నిర్ణయించారు. దీంతోపాటు పారిస్లోని పలు పర్యటక ప్రదేశాలను, సినిమా థియేటర్లను మూసివేశారు. పరిస్థితి సద్దుమణిగిన తరువాత వీటిని తెరవనున్నట్టు సమాచారం.
గత వారం జరిగిన ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకొంది. గత వారం ఆందోళనలకు స్పందించిన ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పెంపు ప్రతిపాదనను పూర్తిగా పక్కనపెట్టినట్టు ప్రకటించింది. కానీ నిరసనకారులు ఆందోళనలను విరమించలేదు. ఈవారం కూడా నిరసన కొనసాగించాలని పలు రైతు, కార్మిక, విద్యార్థి సంఘాలు ఇప్పటికే నిర్ణయించాయి. దేశాధ్యక్షుడి నివాసాన్ని ముట్టడించాలని ఉద్యమకారులు నిర్ణయించారు. ' ఆల్ టు ది ఎలీస్'' అనే నినాదంతో ఆందోళనలు చేపట్టారు.
నిరసనకారుల్ని కట్టడి చేయడానికి పారిస్ వేలసంఖ్యలో పోలీసుల్ని మోహరించారు. దశాబ్దకాలంలో ఫ్రాన్స్లో ఇంత భారీ స్థాయిలో ఆందోళనలు జరగడం ఇదే ప్రథమం. తాజాగా ఫ్రాన్స్లో చోటుచేసుకున్న విధ్వంసంలో 23 మంది భద్రతా సిబ్బంది సహా 263 మంది గాయపడగా, పలు వాహనాలు, భవనాలకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. ఒక్క పారిస్లోనే 133 మంది గాయపడ్డారు. గొడవలకు కారకులైన 412 మందిని పోలీసులు అరెస్టు చేశారు.