Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-బ్రెగ్జిట్పై ఈసీజే రూలింగ్
లండన్ : బ్రెగ్జిట్ క్రమం నుంచి బ్రిటన్ కావాలంటే ఏకపక్షంగా వైదొలగవచ్చని యురోపియన్ కోర్టు ఆఫ్ జస్టిస్ ( ఈసీజే) సోమవారం ఆదేశాలు జారీ చేసింది. బ్రిటన్ ప్రధాని థెరిస్సా మే మంగళవారం బ్రెగ్జిట్పై హౌస్ ఆఫ్ కామన్స్లో కీలకమైన ఓటింగ్ను ఎదుర్కోనున్న నేపథ్యంలో ఈ తీర్పు వెలువడింది. ఈయూ సభ్య దేశం ఏదైనా ఈ క్రమానికి సంబంధించిన 50వ అధికరణను మరో సభ్య దేశం ఆమోదం లేకుండా కొట్టివేయవచ్చని కోర్టు తెలిపింది. ఇతర 27 ఈయూ సభ్యుల అనుమతి లేకుండానే బ్రెగ్జిట్ క్రమాన్ని బ్రిటన్ రద్దు చేసుకోవచ్చు. ఈయూ నుంచి వైదొలగాలన్న తన ఉద్దేశ్యాన్ని ఏకపక్షంగా రద్దు చేసుకునే అవకాశం బ్రిటన్కు ఉందని, బ్రిటన్ సభ్యత్వానికి సంబంధించిన షరతులు, నియమ నిబంధనలను మార్చకుండానే ఇది చేసుకోవచ్చని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఈయూ నుంచి వైదొలగే ఒప్పందం అమల్లోకి రానంతవరకు సభ్య దేశానికి తన వైఖరి మార్చుకునే అవకాశం ఉంటుందని ఈసీజే పేర్కొంది. ఈయూకి తెలియచేసిన తర్వాత రెండేండ్ల కాలంలో మార్చుకోవచ్చని తెలిపింది. అయితే తీసుకునే ఏ నిర్ణయమైనా ప్రజాస్వామ్యబద్ధంగా తీసుకోవాలని కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో, బ్రిటన్ పార్లమెంట్ ఈ నిర్ణయానికి ఆమోద ముద్ర వేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈయూకి తెలియజేయాల్సి ఉంటుంది. ఎంపీలకు ఉన్న అవకాశాలను వివరిస్తూ, మంగళవారం నాటి ఓటింగ్కు ముందు ఈసీజే ఈ రూలింగ్ వెలువడింది. వచ్చే ఏడాది మార్చి29 నాటికి ఈయూ నుంచి బ్రిటన్ వైదొలగాల్సి ఉంది.