Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విశ్వాస పరీక్షలో నెగ్గిన బ్రిటన్ ప్రధాని
లండన్ : బ్రిటన్ ప్రధాని థెరెసా మే కన్జర్వేటివ్ పార్టీ నేతగా విశ్వాస పరీక్షలో నెగ్గారు. బుధవారం జరిగిన ఓటింగ్లో థెరెసాకు 200 ఓట్లు నమోదుకాగా, ఆమె ప్రత్యర్థులకు 117 ఓట్లు మాత్రమే వచ్చాయి. విశ్వాస పరీక్షలో మే 63 శాతం ఓట్లతో విజయం సాధించారు. దీంతో, ఇక పార్టీలో ఆమె నాయకత్వాన్ని మరో ఏడాది పాటు ప్రశ్నించే అవకాశం లేకుండా పోయింది. ప్రజలు ఆమోదించిన బ్రెగ్జిట్ను అమలు చేసేందుకు తాను సంపూర్ణంగా కట్టుబడి ఉన్నానని, అయినప్పటికీ తనను వ్యతిరేకిస్తున్న ఎంపీల ఆందోళనలను కూడా పరిగణనలోకి తీసుకుంటానని థెరెసా అన్నారు. ఎంపీలంతా ఇప్పటికైనా థెరెసాకు మద్దతుగా ముందుకు రావాలని ఆమె మద్దతుదారులు పార్టీకి విజ్ఞప్తి చేశారు. కానీ, ముూడింట ఒక వంతు మంది ఎంపీలు ఆమెను వ్యతిరేకించడం తీవ్రమైన విషయమని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. ఎంపీలు నాయకత్వ మార్పు కోరుకుని ఉంటే థెరెసా మే తప్పనిసరి పరిస్థితుల్లో తన పదవిని వదులుకోవాల్సి వచ్చేది. మెజారిటీ ఎంపీలు థెరిసా నాయకత్వంపై నమ్మకంతోనే ఆమెకు అనుకూలంగా ఓటు నమోదు చేశారు. ఇదిలా ఉండగా, 2016, జూన్23న ఈయూ నుంచి బ్రిటన్ వైదొలగాలా ? వద్దా? అనే అంశంపై రిఫరెండమ్ ప్రవేశపెట్టారు. ఈయూ నుంచి బ్రిటన్ వైదొలగాలనే ప్రతిపాదనకు మెజారిటీ ఓటర్లు ఓట్లు నమోదు చేశారు. దీంతో, బ్రెగ్జిట్ అనివార్యమైంది. అయితే, రిఫరెండమ్ ఫలితాలకు విరుద్ధంగా మే ప్రవేశపెట్టిన బ్రెగ్జిట్ విధానం ఉందని ఎంపీలు ఆరోపిస్తున్నారు.మే బ్రెగ్జిట్ విధానంపై ఆగ్రహంతో ఉన్న ఆమె పార్టీలోని 48 మంది ఎంపీలు అవిశ్వాసం పెట్టారు.ఈయూ చట్టాల ప్రకారం వచ్చే ఏడాది మార్చి29నాటికి బ్రెగ్జిట్ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంటుంది.
బ్రస్సెల్స్కు మే
అవిశ్వాస తీర్మానంలో బలం నిరూ పించుకున్న థెరిసా మే ఈయూ సభ్యదేశాల సదస్సులో పాల్గొనేందుకు బ్రస్సెల్స్కు బయలుదేరినట్టు బ్రిటన్ ప్రధాని కార్యాలయం వెల్లడించింది.