Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డబ్లిన్: అబార్షన్కు చట్టబద్ధత కల్పిస్తూ ఐర్లాండ్ పార్లమెంట్ బిల్లును పాస్ చేసింది. కొద్ది నెలల క్రితం ఇదే అంశానికి ఆమోదం తెలుపుతూ చరిత్రాత్మక రిఫరెండమ్కు ఆ దేశస్థులు మద్దతు తెలిపారు. ఆ క్రమంలోనే ఈ బిల్లుకు ఆమోదం లభించింది. దేశ ప్రధాని లియో వారాద్కర్ మాట్లాడుతూ అబార్షన్కు చట్టబద్ధత లభించడం 'చరిత్రాత్మక సంఘటన' గా అభివర్ణించారు. గర్భం ధరించిన మహిళ ఆరోగ్యానికి ప్రమాదం వాటిల్లుతుందన్న సందర్భంలో 12 వారాల వరకు అబార్షన్ చేయించుకొనేలా అక్కడి మహిళలకు అనుమతి లభించింది. కడుపులో పిండం ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు డెలివరీకి 28 రోజుల లోపులో కానీ, ఇంకా ముందుగానీ దాన్ని తొలగించే అవకాశాన్ని కల్పించింది. 'ఐర్లాండ్ మహిళలకు ఇది చరిత్రాత్మక సమయం. దీనికి మద్దతు తెలిపిన వారందరికి కృతజ్ఞతలు' అని ఆ దేశ ప్రధాని సంతోషం వ్యక్తం చేశారు. అబార్షన్ మీద నిషేధం ఎత్తివేయాలంటూ మేలో ప్రవేశపెట్టిన రిఫరెండమ్కు 66 శాతం మంది ప్రజలు మద్దతు తెలిపారు. 1980 నుంచి 1,70,000 ఐరిష్ మహిళలు అబార్షన్ నిమిత్తం బలవంతగా బ్రిటన్కు వెళ్లారు. ఐర్లాండ్ పూర్తి క్యాథలిక్ దేశం. అయితే కొద్దికాలంగా చర్చి ప్రాబల్యం తగ్గిపోయింది. దాంతో ఈ చట్టానికి ఆమోదం లభించింది. ప్రస్తుతం ఈయూలో కేవలం మాల్టా దేశంలో మాత్రమే అబార్షన్ మీద నిషేధం ఉంది. అయితే రిఫరెండమ్ నెగ్గడం, అక్కడి చట్టసభలో బిల్లు పాస్ కావడం వెనుక ఓ భారతీయ మహిళ పాత్ర కూడా ఉంది. 2012లో సవిత హలప్పనార్ అనే దంత వైద్యురాలుకు అబార్షన్ చేయడానికి అక్కడి వైద్యులు నిరాకరించడంతో ఆరోగ్యం విషయమించి మరణించారు. కడుపులోని బిడ్డ అనారోగ్యం తలెత్తడం వల్లే సవిత మృతి చెందారు.