Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 68లక్షల యూజర్లపై 'బగ్' ప్రభావం
- క్షమాపణలు చెప్పిన ఫేస్బుక్
శాన్ఫ్రాన్సిస్కో: యూజర్ల డేటా దుర్వినియోగం, ఖాతాల హ్యాకింగ్ లాంటి వివాదాలతో సతమతమవుతున్న ప్రముఖ సోషల్మీడియా నెట్వర్క్ ఫేస్బుక్ తాజాగా మరోసారి వార్తల్లోకెక్కింది. ఫేస్బుక్లో ఉన్న లోపం కారణంగా దాదాపు 68లక్షల మంది యూజర్ల ఫొటోలు ఓ థర్డ్ పార్టీ అప్లికేషన్ ద్వారా బహిర్గతమయ్యాయి. దాదాపు 12 రోజుల పాటు ఈ బగ్ యాక్టివ్లో ఉందని, ప్రస్తుతం దాన్ని సరిచేసి నట్టు ఫేస్బుక్ వెల్లడించింది. ఇందుకు గానూ యూజర్లకు క్షమాపణలు కూడా తెలిపింది. ఫేస్బుక్ లాగిన్తో థర్డ్ పార్టీ యాప్లకు యూజర్లు ఫొటో యాక్సెస్ అనుమతి ఇస్తుంటారు. అయితే ఇందులో ఏర్పడిన బగ్ కారణంగా యూజర్లు పోస్టు చేయని ఫొటోలు కూడా యాప్ల ద్వారా బహిర్గతమైనట్టు ఫేస్బుక్ తెలిపింది. ''సాధారణంగా ఫేస్బుక్ ఫొటోలను యాక్సెస్ చేసుకునేందుకు యూజర్లు యాప్లకు అనుమతి ఇచ్చినప్పుడు కేవలం యూజర్లు టైమ్లైన్లో షేర్ చేసిన ఫొటోలను మాత్రమే యాక్సెస్ చేసుకునేందుకు మాత్రమే మేం వీలు కల్పిస్తాం. అయితే ఫేస్బుక్లో తలెత్తిన బగ్ కారణంగా మార్కెట్ప్లేస్ లేదా ఫేస్బుక్ స్టోరీస్లో షేర్ చేసిన ఫొటోలను కూడా యాప్లు యాక్సెస్ చేసుకోగలిగాయి'' అని సంస్థ ఇంజినీరింగ్ డైరెక్టర్ తోమర్ బార్ ఓ ప్రటకనలో వెల్లడించారు. యూజర్లు ఫేస్బుక్లో అప్లోడ్ చేసి పోస్టు చేయని ఫొటోలు కూడా ఈ బగ్ కారణంగా బహిర్గతమైనట్టు తోమర్ బార్ తెలిపారు. సెప్టెంబరు 13 నుంచి 25 వరకు ఈ బగ్ యాక్టివ్లో ఉందని, ఆ సమయంలో దాదాపు 68లక్షల మంది యూజర్ల పోస్టు చేయని ఫొటోలు బహిర్గతమైనట్టు బార్ పేర్కొన్నారు. ఈ విషయమై ఇప్పటికే సదరు యూజర్లకు నోటిఫికేషన్ పంపించినట్టు తెలిపారు.ఘటనపై యూజర్లకు ఫేస్బుక్ క్షమాపణ చెబుతున్నట్టు బార్ చెప్పారు. బగ్ ప్రభావిత యూజర్ల ఫొటోలను ఫేస్బుక్ నుంచి డిలీట్ చేసే పనిలో ఉన్నట్టు ఆయన తెలిపారు. కేంబ్రిడ్జ్ అనలిటికా వివాదం నాటి నుంచి ఫేస్బుక్ చిక్కుల్లో పడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఫేస్బుక్లో తలెత్తిన ఓ లోపం కారణంగా కొందరు హ్యాకర్లు యూజర్ల వ్యక్తిగత డేటాను హ్యాక్ చేశారు. ఈ వివాదాలపై ఫేస్బుక్ పలు దేశాల్లో జరిమానాలు కూడా ఎదుర్కొంటోంది.