Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శ్రీలంక ప్రధాని రాజపక్స రాజీనామా
- మళ్లీ ప్రధాని పీఠంపై రణిల్ విక్రమసింఘే
కొలంబో: శ్రీలంకలో గత రెండు నెలలుగా నెలకొన్న రాజకీయ సంక్షోభం ఓ కొలిక్కి వచ్చింది. ప్రధానమంత్రి పదవికి సీనియర్ నేత మహింద రాజపక్స శనివారం రాజీనామా చేశారు. దేశ స్థిరత్వం కోసం తన తండ్రి ప్రధాని పదవి నుంచి వైదొలగనున్నట్టు రాజపక్స కుమారుడు నమల్ ట్విట్టర్ వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే. శనివారం ఆయన తన రాజీనామాను సమర్పించారు. ప్రధానిగా ఉన్న రణిల్ విక్రమ్సింఘేను ఆకస్మి కంగా తప్పించి ఆయన స్థానంలో మహింద రాజపక్సను నియ మిస్తూ ఈ ఏడాది అక్టోబరు 26న శ్రీలంక అధ్యక్షుడు మైత్రి పాల సిరిసేన సంచలన ప్రకటన చేశారు. దీంతో ఆ దేశంలో రాజకీయ సంక్షోభం తలెత్తింది. ఈ నేపథ్యంలో ప్రధాని బాధ్యతలు స్వీకరించిన రాజపక్స పార్లమెంట్లో తన మెజార్టీని నిరూపిం చుకోవాల్సి ఉండగా.. రెండు సార్లు అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయారు. దీంతో పార్లమెంట్ను రద్దు చేస్తున్నట్టు నవంబరు 9న అధ్యక్షుడు సిరిసేన మరో ప్రకటన చేశారు. దీనిపై కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. పార్లమెంట్ రద్దు చెల్లదని అత్యున్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. మరోవైపు రాజపక్స ప్రధానిగా కొనసాగకుండా అప్పీల్ కోర్టు తీర్పు వెల్లడించింది. ఈ తీర్పుపై రాజపక్స సుప్రీంకోర్టుకు వెళ్లగా అక్కడ ఆయనకు నిరాశే ఎదురైంది. అప్పీల్ కోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ నేపథ్యంలో రాజపక్స రాజీనామాకు సిద్ధమయ్యారు. ఈ విషయమై శుక్రవారం రాత్రి మైత్రిపాల సిరిసేనతో చర్చలు జరిపారు. సిరిసేన కూడా అంగీకరించడంతో రాజపక్స నేడు ప్రధాని పదవికి రాజీనామా చేశారు.
మళ్లీ ప్రధాని పీఠంపై రణిల్
కాగా.. రాజపక్స రాజీనామాతో మళ్లీ రణిల్ విక్రమసింఘే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిరిసేన అంగీకరించినట్టు తెలుస్తోంది. ఆదివారం రణిల్ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసే అవకాశాలున్నాయి. దీంతో శ్రీలంకలో రాజకీయ సంక్షోభానికి తెరపడినట్టేనని అంతా భావిస్తున్నారు.