Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మాలె : మాల్దీవుల మాజీ అధ్యక్షుడు అబ్దుల్లా యామీన్పై తాజాగా మనీ లాండరింగ్ కేసు నమోదైంది. ఒక మిలియన్ డాలర్ల (రూ.7,08,35,000) ప్రభుత్వ నిధులను పక్కదారి పట్టించిన ఆరోపణలను ఆయన ఎదుర్కొంటున్నారు. భారీ మొత్తంలో ప్రభుత్వ సొత్తును స్వాహా చేసిన యామీన్ను కటకటాల వెనక్కి పంపించి తీరుతామని మాల్దీవుల ప్రాసిక్యూటర్స్ చెబుతున్నారు. ఈ కేసులో ఆయనపై తాము నేరారోపణలు నమోదు చేశామని అన్నారు. ఈకేసులో దోషిగా తేలినట్టయితే యామీన్కు 15ఏండ్ల శిక్ష పడే అవకాశముందన్నారు. గతేడాది జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో యామీన్ ఓటమి పాలయ్యారు. ఆయన అధ్యక్ష హౌదాలో ఉండగా భారీ స్థాయిలో అవినీతికి పాల్పడ్డ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మాల్దీవుల్లో పర్యాటక రంగం బాగా అభివృద్ధి చెందింది. ఇక్కడి దీవులను సందర్శించేందుకు లక్షలాది మంది విదేశీ పర్యాటకులు వస్తుంటారు. ఈ దీవుల లీజింగ్ వ్యవహారాలకు సంబంధించి యామీన్ అవినీతికి పాల్పడ్డారు. పర్యాటక రంగం నుంచి లభించిన 79 మిలియన్ డాలర్లను ( రూ.5,59,72,68,500) తన వ్యక్తిగత ఖాతాల్లోకి బదలాయించుకున్నారు. ఎస్ఓఎఫ్ అనే ఓ ప్రయివేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి ఒక మిలియన్ డాలర్లు ముడుపులు స్వీకరించారు. మాల్దీవ్స్ ఇస్లామిక్ బ్యాంక్లో 2015, అక్టోబర్లో యామీన్ నగదు నిల్వలను సీబీఐ అధికారులు పరిశీలించారు. గతేడాది సెప్టెంబర్లో మాల్దీవుల అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. ఈఎన్నికల నిర్వహణకు కొద్దిరోజుల ముందు యామీన్ 1.5మిలియన్ డాలర్ల ( రూ.10,62,77,250 ) ముడుపులు ఓ సంస్థ నుంచి స్వీకరించిన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈకేసు కూడా విచారణ దశలో ఉంది. ఆయన ఖాతాలను సీజ్ చేసినట్టు మాల్దీవ్స్ యాంటీ కరప్షన్ కమిషన్ పేర్కొంది. ఆయన వ్యక్తిగత ఖాతాల్లోని ఆరు మిలియన్ డాలర్లను ( రూ. 42,51,09,000) సీజ్ చేసినట్టు తెలిపింది.