Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆఫ్ఘన్ తాలిబన్ల ప్రకటన
ఇస్లామాబాద్: ప్రస్తుతం కొనసాగుతున్న ఆఫ్ఘన్ శాంతి చర్చల్లో భాగంగా వచ్చే వారం తమ ప్రతినిధులు అమెరికా బృందంతో చర్చలు జరుపుతారని, ఇస్లామాబాద్లో జరిగే ఈ భేటీకి ప్రధాని ఇమ్రాన్ఖాన్, ఇతర ప్రభుత్వ నేతలు హాజరుకానున్నారని ఆప్ఘన్ తాలిబన్లు ఒక ప్రకటనలో తెలిపారు. అయితే తాలిబన్ల ప్రకటనను ఇటు పాకిస్తాన్ కానీ, అటు అమెరికా ప్రభుత్వం కానీ వెంటనే నిర్ధారించకపోవటం గమనార్హం. ఈ నెల 18న ఇస్లామిక్ ఎమిరేట్ (ఆఫ్ఘన్ తాలిబన్), అమెరికా ప్రతినిధి బృందాల మధ్య జరగాల్సిన శాంతి చర్చలకు పాకిస్తాన్ ప్రభుత్వం నుండి లాంఛన పూర్వక ఆహ్వానం అందిందని తాలిబన్ ప్రతినిధి జబివుల్లా ముజాహిద్ పేర్కొన్నారు. ఈ చర్చల్లో భాగంగా తాలిబన్ ప్రతినిధి బృందం పాక్ ప్రధాని ఇమ్రాన్ఖాన్తో కూడా భేటీ అవుతుందని తెలిపారు. రెగ్యులర్ రౌండ్ శాంతి చర్చలు ఈ నెల 25న కతార్లో జరగాల్సి వుందని ముజాహిదీన్ పేర్కొంటూ, పాక్ప్రధాని ఇమ్రాన్ఖాన్తో జరుగనున్న భేటీలో పాక్-ఆఫ్ఘన్ సంబంధాలపై సమగ్ర చర్చలతో పాటు ఆఫ్ఘన్ శరణార్థులు, వ్యాపార వేత్తలకు సంబంధించిన విషయాలను కూడా చర్చించనున్నట్టు చెప్పారు. దాదాపు 17 ఏండ్లుగా ఆఫ్ఘనిస్తాన్లో కొనసాగుతున్న రక్తపాతానికి తెరదించేందుకు తాలిబన్, అమెరికన్ ప్రతినిధి బృందాలు చర్చలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఆఫ్ఘన్ పునరేకీకరణ కోసం నియమించిన అమెరికా ప్రత్యేక ప్రతినిధి జాల్మే ఖలిల్జాద్ దోహాలో తాలిబన్ ప్రతినిధులతో గత నెలలో జరిపిన ఆరు రోజుల భేటీలో గణనీయమైన ప్రగతిని సాధించినట్టు ఇటీవల ఒక ప్రకటనలో తెలిపారు. గత సెప్టెంబర్లో ప్రత్యేక ప్రతినిధిగా నియమితులైన ఖలిల్జాద్ నాటి నుండి ఆఫ్ఘన్లో 17 ఏండ్ల పోరుకు తెరదించేందుకు వీలుగా అన్ని వర్గాలతోనూ చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే.